ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతి లడ్డూ కాంట్రవర్సీ.. ప్రధానికి వైఎస్ జగన్ 8 పేజీల లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2024, 06:53 PM

తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి లడ్డూ వివాదంపై వాస్తవాలు నిగ్గు తేల్చాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. నిరాధార ఆరోపణలు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను, ప్రతిష్టను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఈ లేఖలో వైఎస్ జగన్ ఆరోపించారు. తిరుమల వెంకన్నకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారన్న వైఎస్ జగన్.. ఇలాంటి చర్యలతో దేవస్థానం ప్రతిష్టకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఈ సున్నితమైన అంశంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. లేకపోతే దీర్ఘకాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని ప్రధానికి రాసిన లేఖలో వైఎస్ జగన్ పేర్కొన్నారు.


ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే టీడీపీ కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని వైఎస్ జగన్ లేఖలో ఆరోపించారు. తిరుమల ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న చంద్రబాబును మందలించడంతో పాటుగా ఈ వ్యవహారంలో అసలు నిజాలు బయటపెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వైఎస్ జగన్ కోరారు. తిరుపతి లడ్డూలపై చంద్రబాబు వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయన్న వైఎస్ జగన్.. టీటీడీ నెయ్యి సేకరణ విధానాలను సైతం లేఖలో వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ప్రభుత్వం పాత్ర పరిమితంగా ఉంటుందన్న జగన్ ధర్మకర్తల మండలి పరిపాలనను చూస్తుందని చెప్పారు.


టీటీడీ నెయ్యి సేకరణ ఈ- టెండరింగ్ విధానంలో జరుగుతుందన్న జగన్.. టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఎవరైతే తక్కువ ధరకు కోట్ చేస్తారో వారిని ఎంపిక చేస్తారన్నారు. సరఫరాదారుణ్ని ఎంపిక చేసిన తర్వాత బోర్డు సభ్యుల ఆమోదం కోసం పంపుతారని చెప్పారు. అలా ఆమోదించిన తర్వాత నెయ్యిని సరఫరా చేస్తారన్న వైఎస్ జగన్.. తిరుమలకు వచ్చిన నెయ్యిని కూడా పరీక్షిస్తారని చెప్పుకొచ్చారు. ప్రతి ట్యాంకర్ నుంచి మూడు శాంపిళ్లను సేకరించి పరీక్షిస్తారనీ.. నాణ్యత నిర్ధారణ పరీక్షల్లో అన్నీ కుదిరితేనే నెయ్యిని అనుమతిస్తారని పేర్కొన్నారు.


ఒక్క పరీక్షలో ఫెయిల్ అయినా కూడా ఆ ట్యాంకర్‌ను వెనక్కి పంపుతారన్న జగన్.. ఇన్ని జాగ్రత్తల నడుమ తిరుమల లడ్డూ కల్తీ అయ్యే అవకాశమే లేదన్నారు. తమ పాలనలో 18 సార్లు ట్యాంకర్లను తిరస్కరించిన విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్న జగన్.. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకుని, ఆలయ ప్రతిష్ట దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com