ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి హుండీలో చోరీ.. కోర్టు ఏ శిక్ష వేసిందో తెలుసా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 03:35 PM

తిరుమల శ్రీవారి హుండీలో ఓ భక్తుడు చోరీ చేశాడు. సీసీ కెమెరా ఫుటేజ్‌తో అడ్డంగా దొరికిపోయాడు.. అతడికి కోర్టు శిక్ష విధించింది. రూ.500 తీయగా.. ఓ విధంగా పెద్ద శిక్షే పడింది. ఈ ఏడాది ఆగస్టు 29న కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్‌కు చెందిన మహేష్‌ తిరుమల వచ్చాడు. శ్రీవారి కొత్త హుండీలో డబ్బులను దొంగిలించాడు. ఈ విషయాన్ని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించింది. వెంటనే తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు శ్రీవారి హుండీ నుంచి రూ.500 తీసినట్లు గుర్తించారు. అతడ్ని కోర్టులో హాజరుపరచగా శిక్షను విధించారు. తిరుపతి రెండో అదనపు జూనియర్ జడ్జి కోటేశ్వరరావు తీర్పు చెప్పారు. హుండీలో చోరీ చేసిన మహేష్‌కు రెండు నెలలు జైలు శిక్ష, రూ.100 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. హుండీ నుంచి రూ.500 తీయగా.. రూ.100 జరిమానాతో పాటుగా రెండు నెలల శిక్ష కూడా పడింది.


అంతేకాదు ఈ ఏడాది మే నెలలో తిరుమలలోని నూతన పరకామణి మండపంలో కూడా ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. నోట్ల లెక్కింపు సమయంలో విదేశీ కరెన్సీని సదరు ఉద్యోగి మలమార్గం వద్ద ఉంచుకుని బయటకు వెళుతుండగా విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పరకామణిలో కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు , సీసీ కెమెరాల నిఘా ఉంది. టీటీడీ తిరుమలలో నూతనంగా నిర్మించిన పరకామణి మండపంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన భధ్రతా ఏర్పాట్లతో ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వడం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com