ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబరు 26 వరకూ శ్రీవారి బ్రహోత్సవాలు,,,,4 వేల మంది పోలీసులతో తిరుమలలో భద్రత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 03:15 PM

శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కలియుగ వైకుంఠం తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం (సెప్టెంబరు 17న) అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయి. శ్రీవారి ఆలయంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఇప్పటికే ఉత్సవాలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది అధికమాసం రావడం వల్ల శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.


బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు 9 రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దుచేసినట్టు టీటీడీ ప్రకటించింది. అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను రద్దుచేశామని తెలిపింది. ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు ముందస్తుగా బుక్‌ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహనసేవకు మాత్రమే అనుమతిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. శనివారం తిరుమలకు వచ్చిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. డీఐజీలు రవిప్రకాష్‌, రాజశేఖర్‌బాబు, తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డితో కలిసి మాడవీధుల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు ఆరుగురు ఎస్పీలు సహా 4 వేల మంది సిబ్బందితో భద్రతను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. 21వ తేదీ మధ్యాహ్నం నుంచి తిరుమలకు ద్విచక్ర వాహనాలను అనుమతించబోమని తెలిపారు.


తిరుమలలో 32 స్థలాల్లో 15 వేల వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తామని డీజీపీ చెప్పారు. పోలీసు విభాగంతో పాటు స్పెషల్‌ పార్టీలు, బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌‌లు తిరుమల, రెండు ఘాట్‌ రోడ్లలో నిరంతరం తనిఖీలు చేస్తాయన్నారు. తిరుమల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో నిఘా కేంద్రం ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. పది పోలీస్‌ సబ్‌ కంట్రోల్‌ రూమ్‌లు అందుబాటులో ఉంటాయని, చిన్నారులు, వృద్ధులకు జియో ట్యాగింగ్‌ ఏర్పాటు చేశామని వివరించారు. నేరాల నియంత్రణకు 220 మందితో క్రైమ్‌ పార్టీ అధికారులను నియమించినట్టు డీజీపీ తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com