టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఏపీ భగ్గుమంటోంది. శనివారం (సెప్టెంబర్ 9) ఉదయం 6 గంటలకు సీఐడీ పోలీసులు నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆయణ్ని అరెస్టు చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ తెలిపారు. చంద్రబాబు నాయుడిపై పలు అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన 24 గంటల లోగా ఆయణ్ని జడ్జి ముందు హాజరు పరచాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఐడీ పోలీసులు భారీ భద్రత మధ్య చంద్రబాబు నాయుణ్ని విజయవాడకు తరలిస్తున్నారు. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు.. చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్ను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. జాతీయ రహదారిపై టైర్లకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్తంగా మారింది.
మరోవైపు.. చంద్రబాబు నాయుడు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా వాదనలు వినిపించనున్నారు. ఈయన సుప్రీంకోర్టు లాయర్. తన టీమ్తో ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. బెయిల్ పిటిషన్పై ఆయన వాదనలు వినిపించనున్నారు. భారత్లో ప్రముఖ లాయర్లలో సిద్ధార్థ్ లూథ్రా ఒకరు. టాప్ 10 లాయర్ల జాబితాలో ఆయనొకరు. న్యాయ నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఒక్క పర్యాయం కోర్టులో అటెండ్ అవ్వడానికి ఆయన రూ. 5 లక్షలు ఛార్జ్ చేస్తారు. రవాణా ఖర్చులు, బస, ఇతర సదుపాయాలు అదనం. కేసును బట్టి గంటకు రూ. 15 లక్షల వరకూ ఛార్జ్ చేసే లాయర్లు కూడా భారత్లో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
సిద్ధార్థ్ లూథ్రా తండ్రి కె.కె. లూథ్రా కూడా న్యాయవాదిగా పనిచేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ, డిల్లీ యూనివర్సిటీల నుంచి సిద్ధార్థ్ లూథ్రా.. న్యాయశాస్త్రంలో పట్టాలు అందుకున్నారు. 1990లో ఎల్ఎల్ బీ పూర్తి చేశారు. రాజ్యాంగ చట్టాలు, మానవ హక్కులు, ఇతర న్యాయ సంబంధ అంశాలపై సిద్ధార్థ్ లూథ్రా అధ్యయనం చేశారు. ఆయన ప్రతిపాదించిన పలు అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. పలు పుస్తకాలను కూడా రాశారు. భారత్తో పాటు ఇతర దేశాల కోర్టుల్లోనూ సేవలు అందించిన అనుభవం సిద్ధార్థ్ లూథ్రాకు ఉంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడిపై మోపిన అభియోగాలు ఆర్థిక నేరాల కిందకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. అయితే, చంద్రబాబును రిమాండ్కు తరలించాలంటే.. సీఐడీ పోలీసులు బలమైన సాక్ష్యాధారాలను చూపించాల్సి ఉంటుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. చంద్రబాబు నాయుడికి బెయిల్ వచ్చే అంశం.. ఈ కేసులో ఆయనపై ఎలాంటి అభియోగాలు మోపారనే దానిపై ఆధారపడి ఉంటుందని వీవీ లక్ష్మీనారాయణ చెప్పారు. ‘ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వ నిర్ణయం. అంటే ఇందులో క్యాబినెట్, అధికారుల ప్రమేయం ఉంటుంది. ఇందులో రూ. 550 కోట్ల అక్రమాలు జరిగాయని సీఐడీ చెబుతోంది. అయితే, చంద్రబాబు నాయుడు నేరుగా ఎలా ప్రభావం చూపారనే అంశం ప్రధానమైంది’ అని లక్ష్మీనారాయణ వివరించారు.