స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి.. విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బిడ్డకు మనసు బాగులేనప్పుడు తల్లిదండ్రుల వద్దకు వస్తారు... నా భర్తను అరెస్ట్ చేయడంతో నేను కూడా నా బాధను చెప్పుకోడానికి వచ్చాను.. ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోడానికి దుర్గమ్మ దగ్గరకు వచ్చాను.. అమ్మవారిని నేను కోరింది ఒక్కటే.. చంద్రబాబు నాయుడికి మనోధైర్యాన్ని ఇవ్వాలని వేడుకున్నాను.. తన ఒక్కడి కోసం.. ఆయన కుటుంబం కోసం.. పోరాటం చేయడం లేదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాడుతున్నారు.. ప్రజలందర్నీ మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఒక్కటే ఆయనకు మద్దతుగా ఉండాలి’ అని భువనేశ్వరి అన్నారు.
మరోవైపు, చంద్రబాబునాయుడు అరెస్టును భాజపా ఖండించింది. సరైన నోటీసు ఇవ్వకుండా ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కూడా పేర్కొనలేదని తెలిపారు. కనీసం ఆయన నుంచి వివరణ కూడా తీసుకోలేదన్నారు. అరెస్టు సమయంలో సరైన విధానాలూ పాటించలేదని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును పోలీసులు శనివారం ఉదయం నంధ్యాలలో అరెస్ట్ చేసి.. విజయవాడకు తరలిస్తున్నారు. సాయంత్రానికి ఆయన కాన్వాయ్ విజయవాడకు చేరుకోనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఆయన అదుపులోకి తీసుకున్నట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను కాన్వాయ్లోనే ఎన్ఎస్జీ భద్రతతో విజయవాడకు తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఆయన కాన్వాయ్ చిలకలూరిపేట వద్దకు చేరుకోగానే.. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకుంది. సీఎం జగన్, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాహనాలకు అడ్డంగా నిలిచారు. కొండ్రుపాడులో కాన్వాయ్ నిలిపి.. కాసేపు టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరారు. విజయవాడ చేరుకున్న తర్వాత సిటీ సివిల్ కోర్టులోని 3వ జిల్లా, అదనపు ఏసీబీ మేజిస్ట్రేట్ ముందు చంద్రబాబును సీఐడీ పోలీసులు హాజరపరిచి... రిమాండ్ కోరే అవకాశం ఉంది. ఆయనను కస్టడీలో తీసుకుంటే కుంభకోణం గురించి మరిన్ని వివరాలు బయటకు వస్తాయని సీఐడీ చెబుతోంది. ఈ నేపథ్యంలో సివిల్ కోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.