ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ భూభాగాలను తమవిగా చూపుతూ చైనా మ్యాప్ ,,,,,అక్సాయి చిన్‌, అరుణాచల్‌తో కొత్త మ్యాప్

international |  Suryaa Desk  | Published : Tue, Aug 29, 2023, 09:00 PM

పొరుగుదేశం చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్ భూభాగాలను తమవిగా చూపుతూ కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. సోమవారం విడుదల చేసిన అధికారిక మ్యాపుల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయిచిన్‌ ప్రాంతాలను చైనా భూభాగాలుగా పేర్కొంది. బ్రిక్స్ సదస్సులో మోదీ, జిన్‌పింగ్ భేటీ అయిన నాలుగు రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. చైనా సహజ వనరుల శాఖ ‘2023 ఎడిషన్‌ ఆఫ్‌ ద స్టాండర్డ్‌ మ్యాప్‌ ఆఫ్‌ చైనా’ పేరుతో ఈ మ్యాపుల్ని రూపొందించింది. డిజిటల్‌, నావిగేషన్‌ మ్యాపుల్ని కూడా విడుదల చేస్తున్నట్టు డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ‘చైనా ప్రామాణిక మ్యాప్ 2023 ఎడిషన్ సోమవారం అధికారికంగా విడుదల చేశాం.. సహజ వనరుల మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ ప్రామాణిక మ్యాప్ సర్వీస్ వెబ్‌సైట్‌‌ను ప్రారంభించాం’ అని ట్వీట్ చేసింది.


‘ఈ మ్యాప్ చైనా జాతీయ సరిహద్దులు.. , ప్రపంచంలోని వివిధ దేశాల డ్రాయింగ్ పద్ధతి ఆధారంగా రూపొందించాం’ అని తెలిపింది. చైనా సరిహద్దులు.. అందులో భూభాగాల్ని తెలుపుతూ ఈ మ్యాపుల్ని రూపొందించగా.. భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయిచిన్‌ ప్రాంతాల్ని తమ భూభాగాలుగా చూపింది. గతంలో విడుదల చేసిన మ్యాప్‌లో తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం అంతా తమదేనని పేర్కొంది. తాజా ఎడిషన్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను ప్రామాణీకరిస్తూ మ్యాపును రూపొందించడం గమనార్హం.


అరుణాచల్‌లోని ప్రాంతాలకు చైనా పేర్లు సూచిస్తూ ఈవిధంగా డ్రాగన్ మ్యాపులు విడుదల చేయటం ఇది మూడోసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను చైనీస్, టిబెటన్, పిన్‌యున్ భాషల్లో చైనా సివిల్ ఎఫైర్స్ మినిస్ట్రీ ఆమోదించింది. మొదటిసారి 2017లో చైనా ఆరు ప్రాంతాల పేర్లు మార్చింది. ఆ తర్వాత 2021 డిసెంబరులో మరో 21 ప్రదేశాలకు కొత్త పేర్లు పెట్టింది.


అరుణాచల్ ప్రదేశ్‌‌లో కొంత భాగం తమదేనని చైనా వాదిస్తోంది. ఈ పేర్లు మార్చడాన్ని చైనా తన వాదనలకు మరింత బలం చేకూర్చే ప్రయత్నంగా భావిస్తున్నారు. అయితే, అరుణాచల్ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమని కేంద్రం పలుసార్లు స్ఫష్టం చేసింది. కొద్ది రోజుల్లో జీ20 సదస్సు జరగనున్న వేళ, మ్యాపుల వ్యవహారంపై భారత్‌ ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. గత ఏడాది దేశ సరిహద్దుల నిర్వహణ కోసం అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ప్రత్యేకంగా సరిహద్దు చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com