పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్కు భారీ ఊరట లభించింది. తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్కు విధించిన మూడేళ్ల శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు మంగళవారం రద్దుచేసింది. ఈ కేసులో దిగువ న్యాయస్థానం విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ ఇమ్రాన్ దాఖలు చేసిన పిటిషన్పై ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తోషాఖానా కేసులో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమీర్ ఫరూఖ్, జస్టిస్ తారిఖ్ మొహమూద్ జహంగీరీల ద్విసభ్య ధర్మాసనం.. ఇమ్రాన్కు బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయాన్ని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ సంక్షిప్తంగా వాట్సాప్లో పేర్కొంది.
తీర్పు కాపీ త్వరలోనే అందుబాటులో ఉంచుతామని, ఇమ్రాన్ ఖాన్ అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకుని కింది కోర్టు తీర్పును రద్దుచేశామని జస్టిస్ ఫరూఖ్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ న్యాయ సలహాదారు నదీమ్ హైదర్ పంజోతా ఎక్స్ (ట్విట్టర్)లో ‘ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తమ అభ్యర్థనను ఆమోదించారు.. కోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేశారు.. పూర్తిస్థాయిలో తమ నిర్ణయాన్ని తర్వాత వెల్లడిస్తామని చెప్పారు’అని తెలిపారు.
తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ పిటిషన్పై ఇరువర్గాల వాదనలను సోమవారం విన్న ఇస్లామాబాద్ హైకోర్టు.. తీర్పును రిజర్వులో ఉంచింది. మంగళవారం తీర్పును వెలువరించిన ధర్మాసనం.. ఆగస్టు 5న జిల్లా కోర్టు న్యాయమూర్తి హుమయూన్ దిలావర్ విధించిన మూడేళ్ల జైలు శిక్షను రద్దు చేసింది. పాకిస్థాన్ ప్రధానిగా 2018 నుంచి 2022 మధ్య ఇమ్రాన్ ఖాన్, ఆయన కుటుంబసభ్యులు ప్రభుత్వ కానుకలను చట్టవిరుద్ధంగా అమ్ముకున్నట్టు ఆరోపణలు రావడంతో కేసు నమోదయ్యింది. దీనిపై విచారణ చేపట్టిన ఇస్లామాబాద్ జిల్లా కోర్టు.. ఇమ్రాన్ను దోషిగా నిర్దారించింది. ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించింది.
ఈ తీర్పుపై ఇమ్రాన్ హైకోర్టు ఆశ్రయించగా.. ఆగస్టు 22న విచారణ ప్రారంభించింది. పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ తరఫున న్యాయవాది హాజరుకాకపోవడంతో గత శుక్రవారం కేసు విచారణను వాయిదా వేసింది. అంతకు ముందురోజు ఇమ్రాన్ తరఫున లాయర్ లతీఫ్ ఖోసా వాదనలు వినిపించారు. తీర్పు హడావుడిగా ఇచ్చిందని, లోపాలతో నిండిపోయిందని వాదించారు. శిక్షను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే డిఫెన్స్ బృందం తన వాదనలను పూర్తి చేయడానికి మరింత సమయం కోరింది.
మరోవైపు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియాల్ నేతృత్వంలోని జస్టిస్ మజహర్ అలీ అక్బర్ నఖ్వీ, జస్టిస్ జమాల్ ఖాన్ మండోఖైల్లతో కూడిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ కూడా తోషాఖానా కేసుకు వ్యతిరేకంగా పిటిషన్లను విచారణను పునఃప్రారంభించనుంది. అంతకుముందు తోషాఖానా కేసుపై వివిధ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు బుధవారం సెషన్స్ కోర్టు తీర్పులో లోటుపాట్లు ఉన్నాయని గమనించింది. నిందితులకు రక్షణ హక్కు కల్పించకుండా హడావుడిగా తీర్పు ఇచ్చారని ప్యానెల్ పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ట్రయల్ కోర్టు తీర్పులో లోపాలున్నాయని అన్నారు.