ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానం రీషెడ్యూల్‌తో హోటల్‌కి.. అగ్ని ప్రమాదంలో ఎన్ఆర్ఐ జంట సజీవదహనం

national |  Suryaa Desk  | Published : Tue, Aug 29, 2023, 08:08 PM

మరికొద్ది రోజుల్లో వైవాహిక బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఓ జంటను విధి చిన్నచూపు చూసింది. విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన వారిని.. అగ్ని ప్రమాదం రూపంలో మృత్యువు వెంబడించింది. విమానం రీషెడ్యూల్ కావడంతో ఎయిర్‌లైన్స్ ఓ హోటల్‌లో బస ఏర్పాటుచేయగా.. అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ జంట ప్రాణాలు కోల్పోయారు. గుండెల్ని మెలిపెట్టే ఈ విషాదకర ఘటన ముంబయిలో ఆదివారం చోటుచేసుకుంది. సాంతాక్రూజ్‌ ప్రాంతంలోని గెలాక్సీ హోటల్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. కొద్ది రోజుల్లో వివాహం చేసుకోవాల్సిన ఓ జంట ఉన్న విషయం వెలుగు చూసింది.


వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌‌లోని కచ్ జిల్లా రాంపూర్ గ్రామానికి చెందిన కిషన్‌ హలాయ్‌ (28), అతడికి కాబోయే భార్య రూపాల్‌ వెకారియాల (25) కుటుంబాలు కెన్యా రాజధాని నైరోబిలో స్థిరపడ్డాయి. ఇటీవల జరిగిన కిషన్‌ సోదరుడి వివాహం కోసం నెల క్రితం రెండు కుటుంబాలు భారత్‌కు వచ్చాయి. కిషన్‌ తల్లిదండ్రులతోపాటు కొత్త జంట వారం కిందటే నైరోబీకి కెన్యా వెళ్లిపోయారు. కిషన్‌, రూపాల్‌కు కూడా ఇటీవలే పెళ్లి నిశ్చయం కావడంతో కెన్యాకు వెళ్లిన తర్వాత వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి.


ఈ నేపథ్యంలో కెన్యా వెళ్లేందుకు సిద్ధమైన కిషన్, రూపాల్, ఆమె తల్లి, సోదరి.. ఆగస్టు 27న ముంబయి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే, వారు వెళ్లాల్సిన విమాన రీషెడ్యూల్ చేశారు. దీంతో గెలాక్సీ హోటల్‌లో వారికి ఎయిర్‌లైన్స్ బస ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే వారు ఉంటున్న హోటల్‌లో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో కిషన్‌, రూపాల్‌తోపాటు కాంతీలాల్‌ వారా అనే మరోవ్యక్తి ఉన్నట్లు గుర్తించారు.


ఈ ఘటనలో రూపాల్‌ తల్లి మంజుల బెన్ (49), సోదరి అల్పా (19) తోపాటు అస్లామ్ షైక్ అనే మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలైనట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని రోజుల్లోనే వివాహం చేసుకోనున్న ఈ జంట ప్రాణాలు కోల్పోవడం రెండు కుటుంబాలతోపాటు వారి స్వస్థలం రామ్‌పుర్‌ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. టీనేజ్ వచ్చే వరకూ కిషన్ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నాడని, రూపాల్ నైరోబీలో పుట్టిపెరిగిందని వారి బంధువులు తెలిపారు. కిషన్‌కు 13 ఏళ్ల వయసులో వారు నైరోబీకి వెళ్లినట్టు చెప్పారు. త్వరలో జరగబోయే తమ వివాహానికి షాపింగ్ పూర్తిచేసుకుని, గుజరాత్‌లోని తమ బంధువులను కలవాలనే ఉద్దేశంతోనే వారం తర్వాత బయలుదేరారు. శనివారం అహ్మదాబాద్ నుంచి ముంబయికు చేరుకోగా.. విమానం ఆలస్యమైందని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com