ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిజిస్ట్రేషన్ యూజర్ ఛార్జీలు భారీగా పెంచిన వైసీపీ సర్కార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 26, 2023, 08:18 PM

పలు వాటిల్లో ధరలు పెంచిన వైసీపీ సర్కార్ తాజాగా ప్రజలపై మరో పిడిగుపడేలా  నిర్ణయం తీసుకొంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో యూజర్‌ ఛార్జీలను పెంచారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మార్కెట్‌ విలువ సూచించే డాక్యుమెంట్‌కు రూ.10 నుంచి రూ.50కి పెరిగింది. ఈసీకి నుంచి రూ.100 ఛార్జీ వసూలు చేస్తారు. ఎన్‌ కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ జారీకి రూ.10 నుంచి వందకు పెంచారు. అలాగే సేల్‌ డీడ్‌లు, వీలునామా, గిఫ్ట్‌డీడ్‌, పవర్‌ ఆఫ్‌ అటార్నీలు రిజిస్ట్రేషన్‌ చేసిన ప్రతి డాక్యుమెంట్‌కూ రూ.500 యూజర్‌ ఛార్జీ విధిస్తారు.


అంతేకాదు రూ.లక్ష లోపు విలువ ఉన్న ఆస్తికి స్టాంపులు ఇక నుంచి రూ.50కి పెంచారు. లక్ష దాటితే రూ.100 స్టాంపులను వినియోగించాలి. అలాగే వాణిజ్య సంస్థ, బైలా సొసైటీల రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రానికి రూ.100 యూజర్‌ ఛార్జీ వసూలు చేయనున్నారు. రిజిస్ట్రేషన్‌ చేయదలిచిన దస్తావేజులు పది దాటితే ఒక్కొక్క పేజీకి ప్రస్తుతం తీసుకునే రూ.5ను రూ.10గా పెంచారు. కార్డ్‌ (కంప్యూటర్‌ ఎయిడెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్టుమెంట్‌) కింద అందించే సేవల్లో భాగంగా హార్డ్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌ ఎక్విప్‌మెంట్‌, పవర్‌ బ్యాకప్‌, విద్యుత్తు బిల్లు, ఇతర అవసరాలకు ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపు వెంటనే అమల్లోకి వచ్చినట్లు తెలిపారు.


మార్కెట్ విలువ ప్రకారం ధ్రుపత్రం జారీకి గతంలో రూ.10 ఉంటే ఇప్పుడు రూ.50కి పెరిగింది. ఈసీ సర్టిఫికేట్‌ యూజర్ ఛార్జీ గతంలో రూ.10. ఉంటే.. ఇప్పుడు రూ.100కు పెరిగింది. సర్టిఫైడ్ కాపీ గతంలో రూ.20 ఉంటే.. ఇప్పుడు రూ.100కు పెరిగింది. ప్రతి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జీ రూ.100 నుంచి రూ.200 వరకు ఉంటే ఇప్పుడు రూ.500కు పెరిగింది. రిజిస్ట్రేషన్ చేయదల్చిన పేజీలు పది దాటితే ఒక్కో పేజీకి గతంలో రూ.5 ఉంటే.. ఇప్పుడు రూ.10కి పెంచారు. రూ.5వేలలోపు స్టాంపులు కొనుగోలు చేస్తే గతంలో రూ.10 ఉంటే ఇప్పుడు రూ.50కు పెరిగింది. అలాగే రూ.5వేల కంటే స్టాంపులు కొనుగోలు చేస్తే రూ.20 ఉండేది.. ఇప్పుడు రూ.100 చేశారు. రూ.10వేల నుంచి 99,999 మధ్యన కొనుగోలు చేస్తే రూ.10 ఉండేది.. ఇప్పుడు రూ.50కు పెంచారు. రూ. లక్ష కంటే ఎక్కువగా కొనుగోలు చేస్తే రూ.20 ఉండేది.. ఇప్పుడు రూ.100కు పెంచారు. సర్టిఫైడ్ ఫర్మ రిజిస్ట్రేషన్ రూ.50 నుంచి రూ.100కు పెరిగింది. రిజిస్టర్డ్ సొసైటీ సర్టిఫైడ్ కాపీ రూ.50 నుంచి రూ.100కు పెరిగింది. ఈ పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయని రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ శాఖ తెలిపింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com