అమలాపురం ఎంపీ అనురాధ వ్యాఖ్యలపై మంత్రి పినపె విశ్వరూప్ స్పందించారు. దళితులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్న ఎంపీ అనురాధ వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. ఎంపీకి అవగాహన లేకా.. మరి ఏ ఉద్దేశంతో మాట్లాడారో కూడా తనకు తెలియడం లేదన్నారు. ఆమె మాటలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని.. సంక్షేమ పథకాలను ఎక్కువ శాతం లబ్ధి పొందుతుంది దళితులే అన్నారు.
రాష్ట్రంలో ఎస్సీలు లబ్ధి పొందడం లేదు అన్నమాట ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను అన్నారు మంత్రి విశ్వరూప్. ఎంపీ అవగాహన లేకుండా మాట్లాడిన మాటలను ప్రతి ఒక్కరూ ఖండించవలసిన విషయమని.. రాష్ట్రంలో రూ.52 వేల కోట్లు ఎస్సీలు లబ్ధి పొందారని వివరించారు. రాష్ట్రంలో ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు పథకాలు అందుతున్నాయన్నారు. ఏ పథకం కూడా అవినీతికి తావులేకుండా బటన్ నొక్కగానే అకౌంట్లలో జమ అవుతున్నాయని గుర్తు చేశారు.
రాష్ట్రంలో దళితులకు సంక్షేమ పథకాలు అందడం లేదని ఎస్సీ ప్రజాప్రతినిధుల భేటీలో అమలా పురం ఎంపీ చింతా అనురాధ వ్యాఖ్యానించినట్లు చర్చ జరిగింది. అధికార పార్టీలో కూడా చర్చ జరగడంతో మంత్రి విశ్వరూప్ స్పందించారు. ఒకే జిల్లాకు చెందిన సొంత పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆ వ్యాఖ్యల్ని మంత్రి ఖండించారు. ఈ వ్యాఖ్యలపై ఎంపీ అనురాధ కూడా స్పందించాల్సి ఉంది.