ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాతబస్టాండ్ మూసివేత సిగ్గుచేటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 12:49 PM

రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసింది అనేందుకు కడప పాత బస్టాండ్ మూసివేతనే నిదర్శనమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరి ప్రసాద్ ధ్వజమెత్తారు. కడప నగరంలోని పాత బస్టాండ్ కు మున్సిపాలిటీ కి ఉన్న రూ. 2కోట్ల 30 లక్షలు చెల్లించనందుకు మున్సిపల్ అధికారులు బస్టాండ్ లోకి బస్సులు వెళ్ళకుండా నిలువరించారు. బస్టాండ్ లోకి బస్సుల రాకపోకలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సిపిఎం, సీపీఐ, టిడిపి నేతలు పాత బస్టాండ్ వద్ద గురువారం ఉదయం బస్సులను అడ్డుకొని నిరసన తెలిపారు.


ఈ సందర్భంగా హరిప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అధ్బుతంగా ఉందని పేర్కొంటున్నారని ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే బకాయిలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సుదూర, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న పాత బస్టాండ్ ను బకాయిల కోసం మూసివేయడం జిల్లా ప్రజలకు సిగ్గుగా ఉందన్నారు.


దీన్నీ బట్టి ముఖ్యమంత్రి మాటల్లోని డొల్లతనం బహిర్గతం అవుతోందని పేర్కొన్నారు. అక్రమంగా బస్టాండ్ ను స్వాధీనం చేసుకొనెందుకుబ్ కొందరు తెరవెనుక ప్రయత్నాలు ఉన్నాయోమోనని ప్రజల్లో అపోహలు కలుగుతున్నాయని హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈ విషయాలపై అధికారులు స్పందించడం తో పాటు, తక్షణం ఆర్టీసీ బకాయిలు చెల్లించి బస్సులను బస్టాండ్ లోకి అనుమతించేలా చర్యలు తీసుకోవాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరి ప్రసాద్ డిమాండ్ చేశారు. జనార్ధన్, సురేష్, సురేష్, అమీర్ లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com