ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 09:49 PM

తెలంగాణ అసెంబ్లీ భవనాన్ని అద్భుతంగా పునర్నిర్మించనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నిజాం నిర్మించిన భవనం తరహాలోనే.. రాజసం ఉట్టిపడేలా అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్టు పేర్కొన్నారు. అసెంబ్లీ భవన పునర్నిర్మాణంపై మంగళవారం (అక్టోబర్ 22న) రోజున మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కీలక ప్రకటన చేశారు. రూ.49 కోట్లతో అసెంబ్లీని అద్భుతంగా పునర్నిర్మిస్తామని తెలిపారు. కాగా.. ఈ పునర్నిర్మాణ పనులు 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు.


ముఖ్యంగా పార్లమెంట్ సెంట్రల్ తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు ఒకే దగ్గర ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం.. అసెంబ్లీ నుంచి కౌన్సిల్‌కు వెళ్లాలంటే.. వాహనాలు ఉపయోగించక తప్పడం లేదని చెప్పుకొచ్చారు. రెండు భవనాలు ఒకే దగ్గర ఉంటే సమయం ఆదా అవుతుందని అభిప్రాయపడ్డారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.


ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కూడా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై ఈఆర్సీ వద్దకు కేటీఆర్‌ వెళ్లటం ఒక పెద్ద జోక్ అంటూ కోమటిరెడ్డి సెటైర్లు వేశారు. లోక్‌స‌భ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు రాకున్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించినా కేటీఆర్‌కు బుద్ధి రాలేద‌ని విమర్శించారు. రాష్ట్రంలో నిరుపేదలకు 200 యూనిట్ల మేర ఫ్రీ కరెంటును త‌మ ప్రభుత్వం అందిస్తోంద‌ని కోమటిరెడ్డి గుర్తుచేశారు.


మరోవైపు.. తెలంగాణ బీజేపీ నేతలపై కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తెలంగాణకు ఏమీ చేయలేదని.. విమర్శలు గుప్పించారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు కూడా మూసీ ప్రక్షాళనపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల బాధలు కిషన్ రెడ్డికి తెలియవా అని ప్రశ్నించారు. అసలు కిషన్ రెడ్డి గురించి మాట్లాడుకోవడమే సమయం వృథా అంటూ ఎద్దేవా చేశారు. ఆయన పెద్ద రాజకీయ నాయకుడు కూడా కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com