ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి చేయలేదని తండ్రిని చంపిన కుమారుడు,,తర్వాత సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 07:37 PM

నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కని పెంచిన తండ్రినే ఓ కసాయి కుమారుడు పొట్టనపెట్టుకున్నాడు. తనకు పెళ్లీడు వచ్చినా.. ఇంకా పెళ్లి చేయటం లేదన్న కారణంతో తండ్రిని చంపేశాడు. అనంతరం సాధారణ మరణంగా చిత్రికరీంచాడు. ఎవరికీ అనుమానం రాకుండా త్వరగా అంత్యక్రియలు పూర్తి చేశాడు. అయితే మృతుడి ఒంటిపై గాయాలు గమనించిన బంధవులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అనంతగిరి గ్రామంలో గౌరు అమృతం కుటుంబం నివసిస్తోంది. అమృతం కుమారుడు మహిపాల్ జులాయిగా తిరుగుతున్నాడు. అయితే గతకొంత కాలంగా తనకు పెళ్లి చేయాలని మహిపాల్ తండ్రిని విసిగిస్తున్నాడు. పెళ్లీడు వచ్చినా ఇంకా పెళ్లి చేయటం లేదని తండ్రితో గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం కూడా తండ్రితో గొడవ పడ్డాడు. క్షణికావేశంలో తండ్రి గొంతు నులిమి హత్య చేశాడు.


అనంతరం ఆందోళనకు గురైన మహిపాల్ సాధారణ మరణంగా ఫ్రేం చేసే ప్రయత్నం చేశాడు. హార్ట్ ఎటాక్‌తో చనిపోయినట్లు బంధువులను, గ్రామస్థులను నమ్మించాడు. ఆలస్యం చేయకుండా వెంటనే అంత్యక్రియలు పూర్తి చేశాడు. అయితే మృతుడి శరీరంపై కొన్ని గాయాలను బంధువులు, గ్రామస్తులు గుర్తించారు. మహిపాల్‌పై అనుమానం వ్యక్తం చేశారు. కుమారుడే చంపేసి ఉంటాని భావించారు. ఈ మేరకు అమృతం బంధువులు నవీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మహిపాల్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. ముందు తాను ఏ తప్పు చేయాలేదని మహిపాల్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. జరిగిన విషయాన్ని చెప్పాడు. తనకు పెళ్లీడు వచ్చినా ఇంకా పెళ్లి చేయటం లేదని.. ఈ విషయమై తండ్రితో గొడవ జరిగినట్లు చెప్పాడు. ఆ గొడవలో కోపంతో తన తండ్రి గొంతు నులిమి హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు మహిపాల్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.


స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచిన కుమారుడే తండ్రిని హత్య చేయటం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏ పని చేయకుండా జులాయిగా తిరగటమే కాకుండా.. పెళ్లి చేయటం లేదని తండ్రి చంపటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిపాల్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com