భూమి కోసం భుక్తి కోసం ప్రజల విముక్తి కోసం నిజాం దొరలను ఎదురించి దొరల గడీలను గడగడలాడించిన తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరును రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టడం హర్షణీయమని నూతనంగా ఎన్నికైన చిట్యాల ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గజ్వేల్ నియోజకవర్గ రజక సంఘం రాచమల్ల ఎల్లేష్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన జగదేవ్ పూర్ లో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మకు సమాజంలో సముచితమైన స్థానం దక్కడం చరిత్రలో మహనీయులను గౌరవించుకోవడమేనని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఐలమ్మ జయంతి, వర్టంతులను అధికారికంగా నిర్వహిస్తుండగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి ఐలమ్మ పేరు పెట్టడం ఎంతో చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఈ క్రమంలో సాహసోపేత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకఁ చేయాలని రాష్ట్రంలోని రజక సంఘాల నాయకులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగే ఐలమ్మ జయంతి ఉత్సవాలకు ప్రజలు మేధావులు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆయనతో పాటు సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రజక వ్యాపారా సంఘాల కన్వీనర్ నమిలె నర్సింలు, మండల రజక సంఘం నాయకులు అక్కారం నర్సింలు, వడ్లకొండ శ్రీనివాస్, రాచకొండ యాదగిరి, బాల్ నర్సయ్య, సీతయ్య, రాచమల్ల నర్సింలు, పాండు, అక్కరాజు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.