ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి కేంద్రం మరోసారి నిధుల విడుదల.. ఈసారి ఎంతంటే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 12, 2024, 06:48 PM

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం కింద తొలి విడతగా ఏపీకి రూ.593.26 కోట్లు నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు ఈ నిధులు కేటాయిస్తారు. మరోవైపు ఇటీవలే కేంద్రం గోదావరి పుష్కరాలకు సైతం నిధులు విడుదల చేసింది. అఖండ గోదావరి ప్రాజెక్టు కింద తూర్పుగోదావరి జిల్లాలో పుష్కర పనుల కోసం రూ.100 కోట్లు విడుదల చేశారు.2027లో గోదావరి పుష్కరాలు రానున్నాయి. అప్పటిలోగా ఈ నిధుల సాయం పుష్కర ఘాట్లు, ఇతరత్రా ఏర్పాట్లు చేయనున్నారు.


మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్నుల్లో వాటా కూడా విడుదల చేసింది. రాష్ట్రాలకు పన్నుల్లో వాటా కింద 1,78,173 కోట్ల రూపాయలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 2024 అక్టోబర్ నెలలో చెల్లించాల్సిన సాధారణ వాయిదాకు అదనంగా ఒక ముందస్తు వాయిదా విడుదల చేసింది. పండుగల సీజన్‌ నేపథ్యంలో.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడానికి వీలుగా పన్నుల వాటా విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన పన్నుల వాటాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 7,211 కోట్లు, తెలంగాణకు రూ. 3,745 కోట్లు వచ్చాయి. ఈ లోపే 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.


మరోవైపు ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి పలు అంశాల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి మద్దతు లభిస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యం దక్కింది. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ.15000 కోట్లు సాయం అందించేందుకు సైతం కేంద్రం అంగీకరించింది. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకారం అందిస్తోంది. తాజాగా పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు కూడా విడుదల చేసింది. ఇక ఇవే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కేంద్రం సానుకూలతతో ఉంది. సెయిల్‌లో.. విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనం చేసే ప్రతిపాదనలను సైతం పరిశీలిస్తోంది. ఇక విశాఖపట్నం రైల్వే జోన్‌కు డిసెంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన సైతం జరగనున్నట్లు తెలిసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల ఇదే విషయాన్ని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com