తెలంగాణలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరికి మించి జ్వరాలతో మంచం పడుతున్నారు. చాలా మందిని దగ్గు, జలుబు, తలనొప్పి వంటి లక్షణాలు ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో కొందరు ఆసుపత్రులకు వెళ్లకుండా సొంతంగానే మెడిసిన్ వాడుతున్నారు. మెడికల్ షాప్కు వెళ్లి దగ్గు మందు, జ్వరం ట్యా్బ్లెట్లు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు.
ఇదిలా ఉండగా డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు వేసుకోవటం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లో నకిలీ, ప్రమాదకర మందులు అందుబాటులో ఉన్నాయని.. అవి తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ కేంద్రంలో తయారవుతున్న దగ్గు మందును ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేసారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా దగ్గు మందు తయారు చేస్తున్న కంపెనీపై అధికారులు రైడ్స్ చేశారు. నగరంలోని కూకట్పల్లిలో అఖిల్ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీ 'Glycoril Cough Syrup' అనే పేరుతో దగ్గు మందును తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
అయితే ఈ దగ్గు మందులో ఎటువంటి క్వాలిటీ స్టాండర్డ్స్ లేవని అధికారులు గుర్తించారు. ఈ సిరప్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, వినియోగించవద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటికే ఈ దగ్గు మందు వాడుతున్నట్లయితే వెంటనే మానేయాలని చెబుతున్నారు. ఇలాంటి మందులు ఉంటే 1800-599-6969 నెంబర్కు కాల్ చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే ఫార్మా కంపెనీలపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అంటున్నారు.
ఈ సీజన్లో జ్వరాలు సర్వ సాధారణం అని.. ఎవరికైనా లక్షణాలు ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ సిఫార్సు మేరకే మందులు వాడాల్సి ఉంటుందని.. సొంతంగా మెడిసిన్ వేసుకోవటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. మార్కెట్లో నకిలీ మెడిసిన్ విక్రయిస్తున్నారని.. అటువంటి వాటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.