తెలంగాణ వాసులకు గుడ్న్యూస్. త్వరలోనే ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందనుంది. నగరాలు, పట్టణాలతో పాటుగా గ్రామాల్లోనూ ఇంటింటికీ హైస్పీడ్ క్వాలిటీ ఇంటర్నెట్ అందించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు మెుదలు పెట్టింది. రాష్ట్రంలోని మెుత్తం 33 జిల్లాలను 10 జోన్లుగా విడగొట్టి టీ ఫైబర్ గ్రిడ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రవేటు సంస్థల ద్వారా ఇంటర్నెట్ అందించేందుకు ఫ్లాన్ చేస్తోంది. అందుకోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఆయా సంస్థల నుంచి అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ముందుగా 3 నెలల పాటు ఇంటర్నెట్, టీవీ ప్రసారాలు ఉచితంగా అందించనున్నారు. ఆ తర్వాత అతి తక్కువ ధరలకే ఈ సేవల్ని అందించేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టారు. అందుకు అధికారులు కార్యచరణ మెుదలుపెట్టారు.
నెలకు రూ.300 ఉండే ఛాన్స్
మూడు నెలల తర్వాత ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ- ఎడ్యుకేషన్ సేవలను రూ.300 అందించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో సమావేశమయ్యారు. తమప్రభుత్వం చేపడుతున్న టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ -3లో చేర్చాలని సీఎం కేంద్రమంత్రిని కోరారు. తెలంగాణలోని ప్రతి గ్రామం, మండలాలకు నెట్వర్క్ కల్పించడమే టీ- ఫైబర్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి సింధియాకు సీఎం రేవంత్ వివరించారు. 65 వేల ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని వివరించారు.
తెలంగాణలో టీ- ఫైబర్ ప్రాజెక్టు అమలుకు ఎన్ఎఫ్ఓఎన్ సహకారం అవసరమని..ప్రాజెక్టు కోసం రూ.1,779 కోట్ల వడ్డీ లేని రుణం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల ఇండ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. నెలకు నామమాత్రంగా కేవలం రూ.300లకే హైస్పీడ్ ఇంటర్నెట్, టీవీ, ఈ- ఎడ్యుకేషన్ సేవలు అందించనున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేయగా.. తాజాగా టెండర్లు ఆహ్వానించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. త్వరలోనే పథకం ప్రారంభించనుండగా.. మూడు నెలల పాటు ఉచితంగా సేవల్ని పొందొచ్చు.