తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో రేవంత్ను కలిశారు. ఇటీవల తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయనిధికి పవన్ రూ. కోటి విరాళం ప్రకటించగా.. అందుకు సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పవన్ను సీఎం రేవంత్ శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. అనంతరం వరద సహాయక చర్యలతో పాటు ఇరు రాష్ట్రాల అభివృద్దిపై కాసేపు చర్చించారు.
కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. వరద బీభత్సం కారణంగా లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లూ వాకిలి వరదల్లో కొట్టుకుపోయి కట్టుబట్టలతో రోడ్డుప్డారు. తెలంగాణ వ్యాప్తంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో వరద బాధితులకు సాయం అందించేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం సహాయనిధికి పవన్ రూ.కోటి విరాళం ప్రకటించగా.. అందుకు సంబంధించిన చెక్కును తాజాగా అందించారు.
ఇక వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి మెగా గ్రూప్ భారీగా విరాళం ప్రకటించింది. బాధితులను ఆదుకునేందుకు రూ. 5 కోట్ల విరాళాన్ని అందించింది. ఈ మేరకు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో స్పందించి ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు వారిని సీఎం అభినందించారు.
వరద బాధితులకు సహాయార్థం ప్రఖ్యాత లలితా జ్యువెలరీస్ సంస్థ అధినేత కిరణ్ కుమార్ సైతం సీఎం సహాయ నిధికి రూ.కోటి రూపాయల విరాళం అందించారు. మైత్రా ఎనర్జీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, అక్షత్ గ్రీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సంయుక్తంగా రూ.కోటి రూపాయల విరాళం ప్రకటించారు. సైయెంట్ గ్రూపు ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీ మోహన్ రెడ్డి సైతం రూ. కోటి విరాళం అందించారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు సీఎం సహాయ నిధికి రూ.25 లక్షలు ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందించారు.