వికారాబాద్ జిల్లా లో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనుల బిల్లుల పరిశీలన పూర్తి చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రత్యేక అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపట్టిన పనుల రికార్డుల పరిశీలనను ప్రత్యేక అధికారులు కలెక్టర్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద 924 పాఠశాలలు ఎంపిక చేయడం జరిగిందని, ఇప్పటికే 450 పాఠశాలకు సంబంధించి చెల్లింపులు చేయడం జరిగిందన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా పాఠశాల భవనాల మరమ్మత్తులు, త్రాగునీరు, విద్యుత్ , మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన పనుల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారుల సూచించారు. రికార్డుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసినట్లయితే పాఠశాలల్లో చేపట్టిన పనులకు త్వరలోనే చెల్లింపుల ప్రక్రియ చేపట్టేందుకు వీలుగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంబి (మెజర్మెంట్ బుక్) రికార్డుల ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డి ఆర్ డి ఓ శ్రీనివాస్, డీఈఓ రేణుకా దేవి, అమ్మ ఆదర్శ పాఠశాల ప్రత్యేక అధికారులు, ఇంజనీర్ విభాగం అధికారులు పాల్గొన్నారు.