తెలంగాణలో గత పది రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జులై మూడో వారంలో వర్షం పలకలరించగా.. వరుసగా ఐదు రోజుల పాటు ముసురు కమ్ముకుంది. ఆ తర్వాత కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, జలాశయాలు నిండుకుండలుగా మారాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు. నేడు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్, అసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట్, మెదక్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో మోసరు వర్షాలు కురుస్తాయని చెప్పారు.
వర్షాలతో పాటు భారీగా ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పొలం పనులు చేసేవారు వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండొద్దన్నారు.
ఇక నేడు హైదరాబాద్లో పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పూర్తిగా మబ్బులు కప్పేసి ఉంటాయని సాయంత్రం లేదా రాత్రి సమయానికి జల్లులు పడే ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు నగర ప్రజలను అప్రమత్తం చేసారు. కాగా, సోమవారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం తర్వాత కొన్ని ఏరియాల్లో జల్లులు కురిశాయి. జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. మహబూబాబాద్ జిల్లా గార్లలో అత్యధికంగా 2.78 సెం.మీ వర్షం కురిసింది. ఆసిఫాబాద్ జిల్లా టీ సిర్పూర్లో అత్యల్పంగా 1.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.