ఇరిగేషన్ శాఖలో ఇక నుంచి ఒక కొత్త చాప్టర్ మొదలు పెడుతున్నామని.. ఆరున్నర లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇవ్వబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ కుంగింది ముమ్మాటికీ రీ- డిజైనింగ్, రీ- ఇంజినీరింగ్ వల్లేనని మంత్రి తేల్చిచెప్పారు. అంతటి నిర్వాకం జరిగింది మాజీ సీఎం కేసీఆర్ వల్లే జరిగిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ స్వయంగా ప్రాజెక్ట్ డిజైన్ చేశారంటూ గులాబీ దండు ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారంటూ గుర్తుచేశారు. మేడిగడ్డకు నీళ్లు ఎందుకు పంపింగ్ చేయడం లేదని ప్రశ్నించిన కేటీఆర్కు మంత్రి కౌంటర్ ఇచ్చారు. కట్టినప్పుడూ, కూలినప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. అలాంటప్పుడు ఆ నెపం మరొకరి మీదకు నెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కొట్టిపారేశారు. వాస్తవాలను వక్రీకరించడం కేటీఆర్కు వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు. ఇప్పటికైనా గ్లోబెల్స్ ప్రచారం ఆపాలని మంత్రి ఉత్తమ్ హితవుపలికారు.
కాళేశ్వరంకు మేడిగడ్డ గుండెకాయ అని ప్రగల్బాలు పలికింది బీఆర్ఎస్ నేతలేనని.. అటువంటి బ్యారేజ్ కుంగినప్పుడు తీసుకున్న చర్యలు ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 94 వేల కోట్లు ప్రజాధనాన్ని వినియోగించి 93 వేల ఎకరాలను కుడా సేద్యంలోకి తీసుకరాకపోవడమే కేసీఆర్ రీ-డిజైనింగ్, రీ-ఇంజినీరింగ్ గొప్పతనమా అని ప్రశ్నించారు. బ్యారేజ్ల నిర్మాణం సమయంలో సెంట్రల్ వాటర్ కమిషన్(CWC) అనుమతి ఎందుకు తీసుకోలేదో వివరించాలన్నారు.
మేడిగడ్డకు నీళ్లు పంపింగ్ చేసిన పక్షంలో జరగబోయే ప్రమాదాన్ని తలుచుకుంటేనే ఒళ్లుగగుర్పాటుకు గురవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జరగబోయే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అంతా ఇంతా అని చెప్పలేమన్నారు. సమ్మక్క సారక్క ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో పాటు సీతారాం ప్రాజెక్ట్ డ్యామేజ్ అవుతుందని తెలిపారు. అంతటితో ఆగకుండా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్న భద్రాచలం పట్టణంతో పాటు 44 గ్రామాలు ముంపునకు గురవుతాయన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నీళ్లు ఆపిన పక్షంలో.. ప్రమాదం జరిగితే ఎవరు భాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఒకవేళ ప్రమాదం జరిగితే భద్రాచలం రాముడి గుడి కూడా మునుగుతుందని హెచ్చరించారు.
తమ ప్రభుత్వానికి ఎటువంటి దురాలోచన లేదని ఉన్నదల్లా దూరాలోచననే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఉంటే గింటే ఆ దురుద్ధేశాలు ఏవో బీఆర్ఎస్ వాళ్లకే ఉన్నందునే నిపుణులు చెప్పిన విషయాన్ని పక్కనపెట్టి.. పంపింగ్ డిమాండ్ చేస్తున్నారన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను ఏ విదంగా వినియోగంలోకి తీసుకురావాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం అన్నారు. కాళేశ్వరంలో మూడు బ్యారేజీలు తప్ప మిగతా అన్ని రిజర్వాయర్లను వాడుకుంటామన్నారు. ఇది ముమ్మాటికీ తెలంగాణా ప్రజల సొత్తని.. ప్రజలను తాకట్టు పెట్టి కట్టిన ప్రాజెక్ట్లని కాపాడుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.