ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో మరో టూరిజం స్పాట్‌.. అభివృద్ధికి ప్రణాళికలు.. సిద్దిపేటకు అతి చేరువలో

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2024, 07:49 PM

తెలంగాణలో ఇప్పటికే ఎన్నో ప్రకృతి రమణీయ ప్రాంతాలు ఉన్నాయి. అందులో చాలా వరకు పర్యాటక ప్రదేశాలుగా పేరుపొందగా.. మరికొన్ని ప్రాంతాలు ప్రాచుర్యంలోకి రాలేదు. గత ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయగా.. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఆ దిశగా ఆలోచనలు చేస్తోంది. ప్రాచుర్యంలో లేకుండా పోయిన ప్రకృతి రమణీయ ప్రాంతాలను గుర్తించి.. వాటిని పర్యాటక ప్రదేశాలుగా మార్చేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం పర్యటక శాఖ ప్రణాళికలు రచిస్తోంది.


ఈ క్రమంలోనే.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమ్మాపూర్ గ్రామ పరిధిలో.. అత్యంత ఆహ్లాదకరంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎతైన పర్వత ప్రాంతాలను, గుట్టల మధ్య ఉన్న మహాసముద్రాల గండి చెరువును జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరితో కలిసి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎతైన గుట్టలను కలుపుతూ మధ్యలో ఉన్న చెరువును చూడడానికి చాలా మంది పర్యటకులు వస్తారని స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకురాగా.. ఈ ప్రాంతాన్ని ఒక పెద్ద పర్యటక క్షేత్రంగా మార్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయించారు.


ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. నాచురల్‌గా కొండల నుంచి వచ్చే జాలు ద్వారా నిండే చెరువును, చెరువు నుంచి నీరు వదిలే తూము మార్గం, చెరువు నిండిన తర్వాత బయటకు నీరు బయటకు వెళ్లే మత్తడి ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. చుట్టూ కొండల మధ్యలో ఉన్న చెరువును చూడడానికి పెద్ద ఎత్తున పర్యటకులు వస్తారని.. వారి కోసం రోడ్డు నిర్మాణం చేయటమే కాకుండా.. తూము మార్గం, మత్తడి ప్రాంతాలను అభివృద్ధి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇందు కోసం పర్యాటక శాఖతో సమావేశం నిర్వహించి.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.


అక్కడి గ్రామస్థులతో కూడా మంత్రి మాట్లాడారు. బైలంపూర్ చెరువు నిండుగా ఉంటేనే హుస్నాబాద్‌లో భూగర్భజలాలు పెరిగి.. నీటికి ఎలాంటి సమస్యా ఉండదని.. లేకపోతే నీటి కటకట తప్పదంటూ స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో.. వానకాలంలో మాత్రమే కనిపించే ఆరిద్ర పురుగును ఆపురూపంగా చేతులో పెట్టుకుని చూస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ మురిసిపోయారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ మను చౌదరి.. ఇతర అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com