ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు హగ్.. మహిళా ఏఎస్‌పై వేటు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 07:28 PM

తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత.. నగర వీధుల్లో పర్యటిస్తూ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. తన ప్రత్యర్థి అయిన ఎంఐఎం అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీపై ఘాటు విమర్శలు చేస్తూ.. ఈసారి హైదరాబాద్‌లో ఎగిరేది బీజేపీ జెండానే అంటూ దీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. మాధవీలత చేస్తున్న కొన్ని పనులకు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌లు, పోలీసుల కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది.


అయితే.. ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ మాధవీలత సభలు నిర్వహిస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాలు సున్నితమైనవిగా ఉండగా.. ఆ ప్రాంతాల్లో బీజేపీ నిర్వహిస్తున్న ప్రచారంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే.. మాధవీలత పాల్గొన్న సభకు బందోబస్తుగా సైదాబాద్ ఏఎస్‌ఐ ఉమాదేవి వచ్చారు. ఆ సమయంలో.. మాధవీలతను చూసిన ఉమాదేవి.. చిరునవ్వుతో పలకరించటమే కాకుండా.. ఆమెను ఆలింగనం చేసుకుంది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


డ్యూటీలో ఉన్న ఓ పోలీసు అధికారి.. ఓ పార్టీకి చెందిన అభ్యర్థిని ఇలా ఆలింగనం చేసుకుని.. పార్టీకి ఫేవర్‌గా వ్యవహరించటం ఎన్నికల కోడ్ ఉల్లంఘించటం కిందికే వస్తుందని భావించిన పోలీస్ ఉన్నతాధికారులు ఉమాదేవిపై వేటు వేశారు. ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ.. హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే.. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన మాధవీలత.. సిద్ధి అంబర్‌ బజార్‌ మీదుగా వెళ్తున్న సమయంలో మసీదును చూస్తూ విల్లు ఎక్కుపెట్టినట్టుగా.. వ్యవహరించిన తీరుపై దుమారం చెలరేగింది. ఇదే అంశంపై మహ్మద్ షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి బేగంబజార్‌ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. మాధవీలత ప్రవర్తన మైనారిటీల మనోభావాలను కించపరిచేలా ఉందని.. ఆమెపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీసులు మాధవీలతపై క్రిమినల్ కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com