కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు ఫన్నీగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితా పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ స్కీమ్లపై కల్వకుంట్ల కవిత స్పందించారు. ఆమె ఎన్టీవీతో మాట్లాడుతూ... ఈ పదేళ్లలో తెలంగాణ గురించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఏమీ మాట్లాడలేదన్నారు. తొమ్మిది మండలాలను తెలంగాణ నుండి ఏపీలో కలిపితే వారిద్దరు ప్రశ్నించలేదన్నారు. వారు ఈ అన్యాయాన్ని చూస్తూ కూర్చున్నారన్నారు. అలాంటి వారు రేపు తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏం చేస్తారని కవిత ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసునని, ఎవరికి ఓటేస్తే బాగుంటుందో తెలుసునన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆలస్యం చేసినట్లు, వారు ఇచ్చిన హామీలు కూడా అధికారంలోకి రాగానే చేస్తారనే గ్యారెంటీ లేదని, వాటినీ ఆలస్యం చేయవచ్చునన్నారు. విశ్వసనీయ నేతలు, పార్టీలనే ప్రజలు నమ్ముతారన్నారు. కొత్త పార్లమెంట్లో అయినా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కవిత విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉందన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో మహిళలకు కొత్త లక్కు కలిసి వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.