బీజేపీ మహిళా నేత, మాజీ ఎంపీ విజయశాంతి సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అని తుక్కుగూడ సభలో రాహుల్ చెప్పడం సమంజసమైందేనని అన్నారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సోనియా గాంధీ గారిని ఈ రాష్ట్ర ప్రజలందరం తప్పక అభిమానంతోనే చూస్తాంమని రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తామని ఆమె కీలక కామెంట్స్ చేశారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ పొలిటికల్గా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. "ఎంఐఎం, బీఆరెస్ ఒక్కటే అని, సయామీ ట్విన్స్ అని ఎప్పటి నుంచో నేను నిరంతరం చెబుతున్న మాటని ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా బహిరంగ సభలో చెప్పడం ఎంతైనా సమంజసం. అయితే, మిగతా ఎక్కడో రాష్ట్రాలలో ఎంఐఎం కాంగ్రెస్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నదనే వ్యాఖ్యానం పూర్తిగా అయోమయ అంశం, అర్థం కాని విషయం కూడా. అంటే దేశంలోని అనేక రాష్ట్రాలలో ఎంఐఎం ప్రేరేపిత ఓట్లు కాంగ్రెస్కు రాకపోవడం వల్లనే బీజేపీ గెలుస్తున్నదా ? కాంగ్రెస్ ఓడిపోతున్నదా ? ఆ విధంగా కాంగ్రెస్ దేశంలోని అనేక రాష్ట్రాలలో గెలవలేని పరిస్థితులు ఉన్నాయా ?
కాబట్టి ఎంఐఎం లేకుండా దేశంలో ఎక్కడా కూడా గెలవడం సాధ్యం కాదేమో అని కాంగ్రెస్ అభిప్రాయమా ? ఒక్క మాటలో, దేశమంతటా ప్రోద్బలిత వర్గాలను కాంగ్రెస్ కన్నా ఎక్కువగా ఎంఐఎం మరింత ప్రభావితం చెయ్యగలుగుతున్నదా ? ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సోనియా గాంధీ గారిని ఈ రాష్ట్ర ప్రజలందరం తప్పక అభిమానంతోనే చూస్తాం, రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తాం." అని విజయశాంతి కామెంట్స్ చేశారు.