మహారాష్ట్రలో, తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి(టి) గ్రామానికి చెందిన చెందిన నలుగురు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళ్ళితే.... గ్రామానికి చెందిన గొల్లి వైభవ్(24)తో కలిసి షేక్ సల్మాన్ చాంద్(30) శనివారం రాత్రి తన ఎస్యూవీ(ఏపీ28డీడబ్ల్యూ-2119)లో ఆదిలాబాద్కు వచ్చారు. అక్కడ తాంసి మండలం కప్పర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకు క్యాషియర్ శివకృష్ణ(31), భీంపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు క్యాషియర్ కోటేశ్వరరావు(31), బేల తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిబ్బంది హరీశ్, యోగేశ్, జైనథ్ మండలం పెండల్వాడ తెలంగాణ గ్రామీణ బ్యాంకు క్యాషియర్ సుమన్, అర్లి తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి శివశంకర్ను కారులో ఎక్కించుకున్నారు. ఆదివారం, వినాయకచవితి వరుస సెలవులు రావడంతో వీరంతా శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఉన్న చిక్కల్ధారకు విహారయాత్రకు బయలుదేరారు. ఉదయం 7.30కు వీరి వాహనం చిక్కల్ధార హిల్స్టేషన్ వద్దకు రాగానే.. అదుపుతప్పి 200 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. వర్షం, పొగమంచు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాదంలో సల్మాన్, శివకృష్ణ, వైభవ్, కోటేశ్వర్రావు అక్కడికక్కడే చనిపోయారు. క్షతగాత్రులను అమరావతి జిల్లా ఆస్పత్రికి తరలించారు.