తర్వాత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చేది పక్కా టీడీపీ ప్రభుత్వమేనని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును చూసి.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు. అందుకే.. ఏ కేసుతో సంబంధం లేకపోయినా చంద్రబాబును దౌర్జన్యంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. బంతిని ఎంత గట్టిగా నేలకేసి కొడితే అంతే గట్టిగా పైకి వస్తుందని.. అదే మాదిరిగా చంద్రబాబుపై ఎంత దౌర్జన్యం చేస్తే అంతగా జనాల్లోకి వెళ్తారని చెప్పుకొచ్చారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకే ఓ ప్రొసిజర్ ఉంటుందని.. అందులోనూ ఓ మాజీ సీఎంను అరెస్ట్ చేయాలంటే కచ్చితంగా పద్ధతిని ఫాలో అవ్వాల్సి ఉంటుందని రాజాసింగ్ పేర్కొన్నారు. కనీసం.. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు కూడా లేకుండా ఆయనను అరెస్ట్ చేశారని.. ఆ తర్వాత అందులో చేర్చారని చెప్పుకొచ్చారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అంటూ విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి ఏపీలో నీచ రాజకీయాలు చేస్తున్నారని రాజాసింగ్ విమర్శించారు. ఆయన కూడా గతంలో చాలా కేసుల్లో అరెస్టయ్యారని.. తాను ప్రజలకు ఇప్పుడు సీఎంగా ఏం చేస్తున్నారన్నది అందరికీ కనిపిస్తోందన్నారు. కాగా.. తన హయాంలో ప్రజలకు చంద్రబాబు ఎంత సేవ చేశారో కూడా తెలుగు ప్రజలకు తెలుసన్నారు. ఇప్పటికి కూడా చంద్రబాబు ప్రజల సేవ కోసమే జైలుకు వెళ్లారని తెలిపారు. చంద్రబాబు పెట్టిన కేసును కోర్టే కొట్టేస్తుందని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.
చంద్రబాబు అరెస్ట్ మీద.. తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా స్పందించారు. జగన్ ప్రభుత్వంపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబును కక్ష పూరితంగా అరెస్ట్ చేశారనే విషయం స్పష్టంగా కన్పిస్తోందన్నారు. చంద్రబాబును ఆదరాబాదరాగా అరెస్ట్ చేయడంతో టీడీపీ ఇమేజ్ పెరిగిందన్నారు. పార్టీలతో సంబంధం లేని ప్రజలు కూడా చంద్రబాబు అరెస్ట్ను తప్పు పడుతున్నారని గుర్తుంచుకోవాలన్నారు. వాస్తవాలు మాట్లాడితే తమను చంద్రబాబు ఏజెంట్ గానో.. పవన్ ఏజెంట్ గానో ప్రచారం చేయడం వైఎస్సార్సీపీ నేతలకు అలవాటైందంటూ మండిపడ్డారు.