ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగిరం చేయవలసినదిగా మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే రైతులు అకాల వర్షాలతో తల్లడిల్లుతున్నారని, ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని, తేమ శాతం కాస్త అటు ఇటు ఉన్న తూకం వేయాలని హితవు చెప్పారు. రైతులు కూడా ప్యాడి క్లినర్ ల ధాన్యం తూర్పారబట్టి తాళ్లు లేకుండా నాణ్యమైన ధాన్యం కేంద్రాలకు తెచ్చిప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలని సూచించారు.
ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అవసరమైన గన్నీ సంచులు, టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాగింగ్ చేసిన రైస్ మిల్లులకు వెంట వెంటనే తరలిస్తూ మిల్లర్లు కూడా 24 గంటలలోగా ధాన్యం దించుకునేలా పర్యవేక్షించాలని, టాబ్ ఎంట్రీ త్వరితగతిన చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 382 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 6, 458 మంది రైతుల నుండి 56 కోట్ల 77 లక్షల విలువ గల 27, 560 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 7 కోట్ల 18 లక్షలు వారి ఖాతాలో జమ చేశామని, త్వరలో మిగతా డబ్బులను రైతుల ఖాతాలో జమచేస్తామని అన్నారు. కలెక్టర్ వెంట తహశీల్ధార్ ఆంజనేయులు, వ్యవసాయ అధికారులు, కేంద్రం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.