పంచాయతీ కార్యదర్శలు సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఇదిలావుంటే తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలంటూ జూనియర్ పంచాయతీ కార్యదర్శలు సమ్మె బాట పట్టారు. గతకొన్ని రోజులుగా వివిధ రూపాలుగా ఆందోళనలు చేస్తున్నారు. కాంట్రాక్ట్ బేస్డ్గా తీసుకున్న తమను వెంటనే రెగ్యులరైజ్ చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వీరి నిరసనలు ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా.. ఈ అంశంపై టీపీసీసీ రేవంత్ రెడ్డి స్పందించారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీల రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్కు ఆయన బహిరంగ లేఖ రాశారు.
జేపీఎస్ల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందని లేఖలో ప్రభుత్వంపై మండిపడ్డారు. వాళ్లతో గొడ్డు చాకిరీ చేయించుకోవటమే తప్ప.. వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డలు వెనుక వారి కృషి ఉందని.. పగలు రాత్రి తేడా లేకుండా వారితో పని చేయించుకున్నారని అన్నారు. వారి శ్రమతోనే గ్రామ పంచాయితీలకు 79 అవార్డులు వచ్చిన విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలికారు. ఇంత చేసి రాష్ట్రానికి అవార్డులు తెస్తే వారి సర్వీసులను రెగ్యులరైజ్ చేయకుండా వేధించడం సరైంది కాదని అన్నారు.
ప్రొబేషన్ పీరియడ్ తర్వాత జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రొబేషన్ పీరియడ్కు అదనంగా మరో ఏడాది వారితో పని చేయించుకున్నా.. ఇప్పటికీ వారి ఉద్యోగాలకు భద్రత కల్పించకపోవటం దారుణమన్నారు. వారి సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వమం.. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించటం హేయమన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో 56 రకాల విధులను అప్పగించి రోజు 10 నుంచి 12 గంటలపాటు వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారి ఆక్షేపించారు. ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేసారు. లేకుంటే వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవడమే కాక... ప్రత్యక్ష కార్యచరణకు సైతం సిద్ధమవుతామని హెచ్చరించారు.