ఎండాకాలంలోనూ భారీ వర్షాలు కురిసినా మనకు నీటి కష్టాలు తప్పడంలేదు. మొన్నటివరకు భారీ వర్షాలు.. ఇప్పుడు బండలు పగిలే ఎండలు.. బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి హైదరాబాద్లో నెలకొంది. వేసవి ముదురుతున్న వేళ.. నగరవాసులకు తాగునీటి కష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్యాంకర్లపై ఆధారపడాల్సిన దుస్థితి మళ్లీ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. అందుకు కారణం.. మొన్నటి వరకు కురిసిన కుండపోత వర్షాలే. గతేడాది ఆగస్టులో కురిసిన వానలకు వచ్చిన వరదల వల్ల.. మోటర్లు మునిగిపోయి నీటి కష్టాలు రాగా.. ఇప్పుడు కూడా మళ్లీ అదే సీన్ రిపీటయ్యింది. అయితే.. ఈ పరిస్థితికి కారణం అధికారుల నిర్లక్ష్యమనే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే.. హైదరాబాద్ నగరానికి నీటిని సరఫరా చేసేందుకు గానూ.. ఎల్లంపల్లి నుంచి సిద్దిపేట జిల్లా మల్లారం హౌస్లోకి అధికారులు నీటిని విడుదల చేశారు. వాటర్ ఫిల్టర్లోని మోటార్లను సరైన సమయానికి ఆన్ చేయకపోవటం వల్ల పంప్హౌస్ మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. దీంతో.. ఆ నీటిని మొత్తం ఎత్తిపోసిన తర్వాత మోటార్లు ఆన్ చేసేందుకు 3 రోజుల సమయం పట్టనుంది.
ఈ కారణంగా.. కూకట్పల్లి, నిజాంపేట్, బాచుపల్లి, పటాన్చెరు, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, సైనిక్పురి ప్రాంతాలకు మూడు రోజుల పాటు తాగునీరు బంద్ అయ్యే అవకాశం ఉంది. దీంతో.. ప్రజలు తాగునీటి కష్టాలు రానున్నాయి. ఇది గమనించి ఆా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో వేసలి తాపం మొదలవగా.. ఈ కారణంతో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.