ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్తి ఇవ్వలేదని తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లని కూతుళ్లు,,,ఘటనపై ట్విట్టర్‌లో స్పందించిన సజ్జనార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 07:54 PM

తల్లి తన ఆస్తిని పంచి ఇవ్వలేదనే కోపంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన తల్లి మృతదేహాన్ని ఆమె ఇద్దరు కూతుళ్లు తీసుకెళ్లకపోవడంపై పలువురు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన హాట్‌టాపిక్‌గా మారడంతో.. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్‌లో స్పందించారు. 'ఎటుపోతోందీ స‌మాజం!.. త‌ల్లిదండ్రుల గురించి ఇలాంటి వార్త‌లు చ‌ద‌వాల్సి రావ‌డం బాధాక‌రం. క‌న్న కూతుర్లే మాన‌వ‌త్వాన్ని మ‌రిచి ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం దుర‌దృష్ట‌క‌రం. మ‌న ఎదుగుద‌ల‌కు సోపానం వేసిన త‌ల్లిదండ్రుల‌కు మ‌న‌మిచ్చే గౌర‌వం ఇదేనా..? ఇక‌నైనా మారుదాం. మ‌న ఉన్న‌తికి కార‌ణ‌మైన త‌ల్లిదండ్రుల‌ను ఆద‌రిద్దాం!' అని సజ్జనార్ పేర్కొన్నారు.


కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్.బీ నగర్ కాలనీకి చెందిన కిష్టమ్మ(70) ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ముగ్గురు కూతుళ్లు ఉండగా.. ఒక కూతురు మరణించింది. ఆమె పేరు మీద ఉన్న ఆస్తి, బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బులను తమకు ఇవ్వలేదనే కారణంతో ఇటీవల ఆస్పత్రిలోనే కిష్టమ్మపై కూతుళ్లు పెంటవ్వ, ఎల్లవ్వ దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం కిష్టమ్మ మృతి చెందింది. అయితే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆమె ఇద్దరు కూతుళ్లు నిరాకరించారు. డబ్బులు చేతికి అందితే తప్ప తల్లి మృతదేహానికి దహన సంస్కారాలు చేయమని కూతుర్లు తెగేసి చెప్పారు. దీంతో జిల్లా హాస్పిటల్ మార్చురీ ఫ్రీజర్‌లో వృద్ధురాలి మృతదేహాన్ని సిబ్బంది ఉంచాల్సి వచ్చింది.


అయితే ఈ ఘటనకు సంబంధించిన వార్తలు మీడియాలో రావడంతో.. ఇవాళ స్థానిక పోలీసులు స్పందించారు. ఈ రోజు ఉదయం కిష్టమ్మ ఇద్దరు కూతుళ్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తమ తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లలేదని తెలిపారు. తమ తల్లి భిక్షాటన చేస్తుందని, ఆమెకు సంబంధించిన డబ్బులను ఒకరి వద్ద ఉంచిందని పోలీసులకు చెప్పారు. బ్యాంకులో రూ.లక్షకుపైగా డబ్బులు డిపాజిట్ చేసిందని, తమ బంధువు పేరును నామినీగా చేర్చినట్లు చెప్పుకొచ్చారు. దీంతో నామినీగా ఉన్న వ్యక్తిని పోలీసులు పిలిపించి బ్యాంకులో నుంచి డబ్బులు తీసి ఇవ్వాలని సూచించారు. నామినీగా ఉన్న వ్యక్తి డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో.. చివరికి కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుండి తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కూతుళ్లు ఒప్పుకున్నారు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com