వైరాలో రెండిళ్లలో వరుస దొంగతనాలు జరిగాయి. తాళాలు వేసి ఉన్న రెండిళ్లను ఎంపిక చేసుకొని ఈ చోరీలకు పాల్పడ్డారు. 12వ వార్డులోని నాళ్ల శ్రీకాంత్, ఐదో వార్డులోని వజినేపల్లి రవి ఇంట్లో ఈ దొంగతనాలు జరిగాయి. 12వ వార్డులోని నాళ్ల శ్రీకాంత్ ఇంటికి తాళం వేసి రెండు రోజుల కిందట కల్లూరులోని బంధువుల ఇంటికి వెళ్లి ఆదివారం సాయంత్రం ఇంటికి రాగా చోరీ జరిగిన విషయం బయటపడింది. ఇంటి తలుపులు పగులగొట్టి ఈ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని బీరువా తెరిచి వస్తువులన్నీ చిందరవందర చేశారు. మూడు తులాల బంగారం, రూ. 50వేల నగదును దొంగలు అపహరించుకుపోయారని బాధితుడు శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఐదోవార్డులోని వజినేపల్లి రవి ఇంట్లో చోరీ జరిగింది. రవి కుటుంబసభ్యులతో తిరుపతి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది. ఇంటిముందు ఉన్న సీసీ కెమెరాల వైర్లను కత్తిరించి ఇంటి కిటికీలు తొలగించిన దొంగలు లోపలికి ప్రవేశించిబీరువా తెరిచి వస్తువులను చిందరవందర చేశారు. అయితే ఎలాంటి విలు వైన వస్తువులు లేకపోవడంతో టీవీ, స్కూటీతోపాటు ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఆఇంటిపక్కనే ఉన్నవారు గమనించి బంధువులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘ టనా స్థలాలను వైరా ఎస్ఐ శాఖమూరి వీరప్రసాద్ సందర్శించి పరిశీలిం చారు. కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.