అమరావతి : విభజనలో జరిగిన అన్యాయం వల్లనే ఏపీకి ఈ దుస్థితి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నిన్న ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీతో పోలికే లేదనడం బాధకలిగించిందన్నారు. విభజన వల్ల అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవలసిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. ఆ విషయంలో రాజీ పడే ప్రశక్తేలేదు…అవసరమైతే కోర్టుకు వెళతామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం మరో 35 వేల రూపాయలు పెరిగితేనే ఇతర రాష్ట్రాలతో సమానం అవుతామని అన్నారు. దక్షిణ భారత దేశంలో తలసరి ఆదాయంలో ఏపీ అట్టడుగున ఉందని, దీనికి కారణం ప్రజలు కాదు…యూపీఏ చేసిన అన్యాయమని చంద్రబాబు చెప్పారు. పొరుగు రాష్ట్రాల కన్నా 20 నుంచి 25 శాతం వెనుకబడి ఉన్నామన్నారు. విభజన గాయాల నుంచి పూర్తిగా కోలుకోవడానికి మరి కొంత సమయం పడుతుందన్నారు.