ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడో ధనిక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 28, 2017, 12:21 PM

అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన ప్రాంతీయ పార్టీ జాబితాలో దక్షిణాది పార్టీలు ముందజలో ఉన్నాయి. 2015-16కు గానూ 32 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ. 221.48 కోట్లు కాగా, అవి రూ. 110 కోట్లను ఖర్చు పెట్టలేదు. మిగతా పార్టీలతో పోలిస్తే కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే అత్యధికంగా రూ. 77.63 కోట్లు కూడబెట్టింది. రూ. 54.93 కోట్లతో అన్నాడీఎంకే తర్వాతి స్థానంలో నిలిచింది. అధికారంలో లేకపోయినప్పటికీ.. డీఎంకే ఈ జాబితాలో తొలి స్థానంలో నిలవడం విశేషం. అసోషియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషణలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.


ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రూ. 15.97 కోట్ల ఆదాయంతో ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. అదే వ్యయాల విషయానికి వస్తే జేడీయూ తొలి స్థానంలో ఉంది. ఆ పార్టీ రూ. 23.46 కోట్లు ఖర్చు పెట్టగా, టీడీపీ రూ. 13.10 కోట్లతో రెండో స్థానంలో, ఆమ్ ఆద్మీ రూ. 11.09 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి.32 ప్రాంతీయ పార్టీల్లో 14 పార్టీలు వచ్చిన ఆదాయం కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసినట్లు వెల్లడించాయి. జార్ఖండ్ వికాస్ మోర్చా - ప్రజాతాంత్రిక్, జేడీయూ, ఆర్‌ఎల్డీ పార్టీలు 2015-16లో ఆదాయం కంటే దాదాపు రెట్టింపు మొత్తాన్ని ఖర్చు చేశాయి. అదే సమయంలో డీఎంకే, అన్నాడీఎంకే, మజ్లిస్ పార్టీలు వచ్చిన ఆదాయంలో 80 శాతానికిపైగా ఖర్చు చేయకుండా తమ వద్దే అట్టిపెట్టుకున్నాయి.


2015-16 సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలు ఆర్జించిన మొత్తంలో 35 శాతానికిపైగా వాటా డీఎంకేదే కావడం గమనార్హం. టాప్-3లో నిలిచిన మూడు పార్టీల ఆర్జన రూ. 148.54 కోట్లుగా తేలింది. ఇది మొత్తం ప్రాంతీయ పార్టీల ఆదాయంలో 67 శాతమని ఏడీఆర్ స్పష్టం చేసింది. అత్యధిక విరాళాలు పొందిన జాతీయ పార్టీల జాబితాలో బీజేపీ, కాంగ్రెస్ ముందజలో ఉన్నాయనే సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com