శ్రీ వరసిద్ధి వినాయకస్వామి నూతన ఆలయ మహాకుంభాభిషేకం ఈ ఏడాది ఆగస్టు ఏడో తేదీన నిర్వహించనున్నామని ధర్మకర్తల మండలి ఛైర్మన్ ఎ. మోహన్రెడ్డి, ఈవో ఎ. వెంకటేశు తెలిపారు. ఆలయ పరిపాలన భవనంలో సోమవారం ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న బాలాలయాన్ని స్థాపించి, మూడు నెలల్లో ప్రధాన ఆలయ పునర్నిర్మాణం పూర్తిచేసి కుంభాభిషేకం చేయాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్, మే, జూన్ నెలలో భక్తులకు ఉచితంగా మజ్జిగ అందించాలని సభ్యులు సూచించారని, ఇదే క్రమంలో భక్తులకు ఎండ తీవ్రత లేకుండా చలువ పందిళ్లు వేయనున్నామని చెప్పారు. స్వామివారి చెక్క రథాన్ని ఉంచేందుకు మండప నిర్మాణానికి సభ్యులు ఆమోదించారన్నారు. సమావేశంలో ఆలయ ఈఈ వెంకటనారాయణ, ఏసీ కస్తూరి, ఏఈవోలు విద్యాసాగర్రెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, చంద్రశేఖర్, సుధారాణి, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.