కర్ణాటకలోని మైసూరు నగరంలో ఏడు నెలల గర్బిణి అనుమానాస్పద మరణం కలకలం రేపింది. భర్తతో కలిసి షికారుకు వెళ్లిన ఆ యువతి చాలా గంటల తర్వాత శవమై కనిపించింది. పోలీసుల కథనం మేరకు..మైసూరు నగరంలోని విజయనగర్కు చెందిన అశ్విని (23), మైదనహళ్లికి చెందిన ప్రమోద్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అశ్వినీ ఏడు నెలల గర్భిణి. ప్రమోద్తో అశ్విని ప్రేమను కుటుంబీకులు అంగీకరించకపోవడంతో ఆ ఇద్దరూ జూన్ 13, 2021న స్థానికంగా ఓ గుడిలో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరికొద్దిరోజుల్లో తల్లికానుండగా అశ్విని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో అశ్విని పుట్టింటికి వచ్చింది. ఆదివారం ప్రమోద్ అత్తింటికి వచ్చి అశ్వినితో మాట్లాడాడు. మద్యాహ్నం తర్వాత ఇద్దరూ కలిసి బైక్పై బయటికి వెళ్లారు. పొద్దుపోయిన తర్వాత కూడా పిల్లలు ఇంటికి రాకపోవడంతో అశ్విని తండ్రి.. తన కూతురికి, అల్లుడికి ఫోన్లు చేశాడు.
కానీ అటునుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బంధువులంతా కలిసి వెతుకులాట మొదలుపెట్టారు. రాత్రయినా అశ్విని-ప్రమోద్ జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ జంట కోసం పోలీసులు గాలిస్తుండగానే సోమవారం ఉదయం బిళికెరె చెరువులో అశ్విని మృతదేహం బయటపడింది. అశ్విని ఆమె భర్త ప్రమోదే చంపి, చెరువులో పడేసి ఉంటాడని అత్తమామలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం అనంతరం అశ్విని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఘటన తర్వాత కనిపించకుండా పోయిన ప్రమోద్ ను కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.