ఓ వైపు చైనా, దక్షిణ కొరియా, హాంకాంగ్ దేశాల్లో కరోనా బెంబేలెత్తిస్తోంది. అయితే మన దేశంలో మాత్రం కరోనా అదుపులోనే ఉంది. కొంతకాలంగా రోజువారీ కేసులు 3 వేల కంటే తక్కువగానే నమోదవుతున్నాయి. తాజాగా 1700కు దిగిరావడంతో ప్రజల్లో సంతోషం నెలకొంది. అయితే మరణాల్లో మాత్రం హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. గత 24 గంటల్లో 4,31,973 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,761 కోవిడ్ కొత్త కేసులు వెలుగు చూశాయి. తాజాగా 127 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన మొత్తం బాధితుల సంఖ్య 5,16,479కి చేరింది. కోవిడ్ నుంచి 24 గంటల వ్యవధిలో 3196 మంది కోలుకున్నారు. కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం 26,240 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.