రాబోయే బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. భారత్ ఏటా టన్నులకొద్దీ బంగారాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల ఏర్పడుతున్న కరెంట్ ఖాతా లోటును పూడ్చేందుకు కొత్తగా గోల్డ్ సేవింగ్స్ అకౌంట్స్ను తీసుకురావాలని యోచిస్తోందని సమాచారం. ఈ ఖాతాలో గ్రాము బంగారానికి సమాన మొత్తంలో నగదును బ్యాంకులోని గోల్డ్ సేవింగ్స్ అకౌంట్స్లో మదుపు చేయొచ్చు. గ్రాము నుంచి ఎంత వరకైనా ఇందులో డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. తిరిగి నగదును ఉపసంహరించుకునేటప్పుడు ఆ రోజు ధర ఆధారంగా బ్యాంకులు చెల్లింపులు చేస్తాయి. ఇందు కోసం బ్యాంక్ పాస్ బుక్ ను కూడా అందించనున్నాయి. బంగారంపై పెట్టుబడులు పెట్టే వారికి ఉపయోగకరంగా ఈ స్కీమ్ ఉండబోతోందని తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన ఉండే అవకాశం ఉంది.