'ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరు లేరు' అనే మాట మరోసారి రుజువైంది. మధ్యప్రదేశ్ లో ఓ తల్లి చిరుతతో పోరాడి తన బిడ్డ ప్రాణాలను కాపాడుకుంది. ఆ మహిళ ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. ఈ ఘటన సిద్ధి జిల్లా బరిజహారియా గ్రామంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బైగా తెగకు చెందిన కిరణ్ అనే మహిళ ఆదివారం సాయంత్రం తన ఇంటి వద్ద పిల్లలతో కలిసి చలిమంట కాచుకుంటోంది. ఓ బిడ్డ ఆమె ఒడిలో కూర్చోగా మరో ఇద్దరు పక్కనే ఉన్నారు. ఆ సమయంలో ఓ చిరుత అకస్మాత్తుగా ఓ పిల్లాడిని నోట కరచుకుని అడవిలోకి పరుగులు తీసింది. వెంటనే కిరణ్ ఆ చిరుతను వెంబడించింది. కిలోమీటరు దూరంలో చిరుతను గుర్తించి పోరాడింది. ఎంతో కష్టపడి తన కుమారుడిని రక్షించుకుంది. తల్లిబిడ్డలపై చిరుత దాడి చేస్తుండగా గ్రామస్థులు వచ్చి దానిని తరిమేశారు. గాయపడిన తల్లిబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. వారు క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.