చెన్నై: చూడబోతే మాజీ కేంద్రమంత్రి, ఉపరాష్ట్రపతి అభ్యర్ధి వెంకయ్య నాయుడు కూడా ప్రధాని మోదీలాగే కొత్త పదాలను కనిపెట్టడం నేర్చుకొన్నట్లున్నారు. ఇంతకుముందు ప్రధాని మాట్లాడుతూ జీఎస్టీ అంటే ‘గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్’ మాత్రమే కాదని ‘గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్’ అని అర్థమని చెప్పిన విషయం తెలిసిందే.
ఇప్పుడు వెంకయ్యనాయుడు కూడా ఓ పదానికి కొత్త అర్థం చెప్పారు. అదేంటంటే.. ఈరోజు భారత మాజీ రాష్ట్రపతి ఏపీజేఅబ్దుల్ కలాం రెండో వర్ధంతి. ఈ సందర్భంగా రామేశ్వరంలో రూ.15కోట్ల వ్యయంతో నిర్మించిన కలాం స్మారక మండపాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య నాయుడుమీడియాతో మాట్లాడుతూ.. ఏపీజేఏకె అంటే.. ‘ఎనీథింగ్ ఈజ్ పాజిబుల్ విత్ జస్ట్ యాటిట్యూడ్ అండ్ కర్మ’ అని అర్థమని ఈ సందర్భంగా వివరించారు.