ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమలో ట్రెండ్‌ సెట్ చేసే ఏకైక జిల్లా అనంతపురం.. బరిలో ఉన్న అభ్యర్థులు వీరే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 07, 2024, 08:32 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి గట్టి పట్టున్న ప్రాంతం రాయలసీమ. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకూ వైఎస్సార్సీపీ తలపడిన ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీకే మెజార్టీ సీట్లు దక్కాయి. రాయలసీమలో భాగమైన చిత్తూరు చంద్రబాబు నాయుడి సొంత జిల్లా అయినప్పటికీ.. ఇప్పటి వరకూ ఈ జిల్లాలోనూ జగన్‌కే పట్టు ఎక్కువ. రాయలసీమ జిల్లాలకు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలిపి.. గ్రేటర్ రాయలసీమగా పరిగణిస్తారు. గ్రేటర్ రాయలసీమలోనూ జగన్‌ బలమే ఎక్కువ. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్రేటర్ రాయలసీమలో జగన్‌ పార్టీకి అనుకూలంగానే ప్రజలు తీర్పు వెలువరించారు. ఈసారి కూడా రాయలసీమలో మంచి ఫలితాలు రాబడతామని జగన్ ధీమాతో ఉన్నారు.


అయితే రాయలసీమలోని అనంతపురం జిల్లా మాత్రం వైవిధ్యమైన తీర్పును వెల్లడిస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీవైపే అనంతపురం ఓటరు మొగ్గు చూపుతున్నాడు. 2014 ఎన్నికల్లో టీడీపీ వైపు మొగ్గు చూపిన అనంతపురం.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ వైపు మొగ్గింది. రాయలసీమలో మిగతా జిల్లాలు వైఎస్సార్సీపీకి కంచుకోటగా ఉండగా.. ఒక్క అనంతపురం జిల్లా మాత్రం ట్రెండ్‌కే ప్రాధాన్యం ఇస్తోంది. అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా.. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ 12 సీట్లను గెలుచుకుంది. జగన్ నాయకత్వంలోని వైసీపీ.. ఉరవకొండ, కదిరి నియోజకవర్గాల్లో మాత్రమే గెలవగలిగింది.


2019 ఎన్నికల్లో అనంపురం జిల్లాలో సీన్ రివర్స్ అయ్యింది. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో 12 సీట్లు గెలిచిన టీడీపీ.. 2019 ఎన్నికల్లో రెండు స్థానాలకే పరిమితమైంది. హిందూపురంలో బాలయ్య, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ మాత్రమే సైకిల్ గుర్తుపై గెలిచారు. మిగతా 12 నియోజకవర్గాల్లో ఫ్యాన్ గాలి వీచింది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలోని 4 జిల్లాల్లో ఉన్న 42 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు అనంతపురం జిల్లా నుంచే కావడం గమనార్హం. గత రెండు ఎన్నికల్లో రాష్ట్రంలో గెలిచిన పార్టీవైపే మొగ్గు చూపిన అనంతపురం జిల్లా ఈసారి ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.


2024 ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు


నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ టీడీపీ కూటమి


శింగనమల మన్నెపాకుల వీరాంజనేయులు బండారు శ్రావణి శ్రీ


కల్యాణదుర్గం తలారి రంగయ్య అమిలినేని సురేంద్రబాబు


ఉరవకొండ వై. విశ్వేశ్వర రెడ్డి పయ్యావుల కేశవ్‌


రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి పరిటాల సునీత


తాడిపత్రి కేతిరెడ్డి పెద్దా రెడ్డి జేసీ అస్మిత్‌ రెడ్డి


గుంతకల్లు వై. వెంకట రామిరెడ్డి గుమ్మనూరు జయరాం


రాయదుర్గం మెట్టు గోవింద రెడ్డి కాలవ శ్రీనివాసులు


అనంతపురం అర్బన్ అనంత వెంకటరామి రెడ్డి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్


మడకశిర ఈర లక్కప్ప ఎంఎస్ రాజు


పెనుకొండ కె.వి. ఉషశ్రీ చరణ్ కరుబ సవిత


హిందూపురం టీఎన్ దీపిక నందమూరి బాలకృష్ణ


పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పల్లె సింధూర రెడ్డి


ధర్మవరం కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి వై. సత్యకుమార్ (బీజేపీ)


కదిరి మక్బూల్ అహ్మద్ కందికుంట వెంకట ప్రసాద్







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com