ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ అతి త్వరలోనే ఖాతాల్లో జమకానుంది. పీటీఐ కథనం ప్రకారం.. 8.50 శాతం చొప్పున ఈపీఎఫ్ వడ్డీని డిసెంబరు చివరి నాటికి జమచేసే అవకాశం ఉంది. మొత్తం 6 కోట్ల ఈపీఎఫ్వో ఖాతాల్లో ఈ వడ్డీని జమ చేయనున్నారు. ఈ ఏడాడి సెప్టెంబర్లో కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ఆధ్వర్యంలో ఈపీఎఫ్వో ట్రస్టీల భేటీ జరిగింది. 8.50 శాతం వడ్డీని రెండు భాగాలుగా చేయాలని ఆ భేటీలో నిర్ణయించారు. దీని ప్రకారం మొదట 8.15శాతం.. తర్వాతి ఇన్స్టాల్మెంట్లో 0.35 శాతం జమ చేయనుంది. 2019-20 ఈపీఎఫ్పై 8.5 శాతం వడ్డీ చెల్లించే అంశంపై కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి.
ఈ ప్రతిపాదనలకు కొన్ని రోజుల క్రితమే ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. త్వరలోనే వడ్డీ మొత్తం ఆయా ఖాతాల్లో జమకానుంది. మొదట ఈ అంశంపై ఆర్థిక శాఖకు కొన్ని సందేహాలు ఉడడంతో.. వాటిని నివృత్తి చేసుకొనిఆమోద ముద్ర వేసింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్ మొత్తంపై 8.5శాతం వడ్డీ చెల్లించాలని 2020 మార్చిలో కేంద్రమంత్రి అధ్యక్షతన ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీ నిర్ణయించింది. సెప్టెంబర్లో జరిగిన వర్చువల్ మీటింగ్లోనూ ఇదే అంశాన్ని మళ్లీ ధృవీకరిచింది. అయితే వడ్డీని రెండు భాగాలుగా విభజించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ (సీబీటీ) పేర్కొంది. వీటిలో 8.15 శాతం వడ్డీని డెబ్ట్ ఇన్కమ్ నుంచి .. మిగిలిన 0.35శాతం (క్యాపిటల్ గెయిన్స్) మాత్రం ఎక్స్ఛేంజి ట్రేడెడ్ ఫండ్స్ విక్రయం ద్వారా చెల్లించనున్నారు.