జమ్మూకాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు మనదేశంలోకి చొరబడటంతో భారత్ సైన్యం కాల్పులకు దిగింది. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రయత్నిస్తోంది. గురువారం బారాముల్లా ల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. వారిలో ఒకరు కాశ్మీరీ కాగా.. మరొకరు పాకిస్తానీ. కాశ్మీర్కు చెందిన ఆ టెర్రరిస్టును అమీర్ సిరాజ్ గా పోలీసులు గుర్తించారు. అమీర్ సిరాజ్ కాలేజీ విద్యార్థి. అంతేకాదు ఫుట్బాల్ ప్లేయర్. కాలేజీలో బుద్ధిగా చదువుకుంటూ ఫుట్బాల్ ఆడుకునే సిరాజ్.. ఇటీవలే ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడయ్యాడు.
జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరి భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఇటీవలే ఉగ్రవాద సంస్థలో చేరాడు. చేరిన కొన్ని రోజుల్లోనే సిరాజ్ మృత్యువాతపడ్డాడు. ఇకపోతే బారాముల్లాలోని వనిగమ్ పయీన్ ప్రాంతంలో ఇద్దరు టెర్రరిస్టులు ఉన్నారని భద్రతా దళాలకు గురువారం సమాచారం అందింది. రంగంలోకి దిగిన భద్రతా దళాలు.. వారు ఉంటున్న ఇంటిని చుట్టుముట్టారు. లొంగిపోవాలని కోరారు. కానీ ఉగ్రవాదులు వినలేదు. భద్రతాదళాలపైకి కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు అంతమెుందించాయి.
ఉగ్రవాదుల్లో ఒకరిని పాకిస్తాన్కు చెందిన అర్బ్రార్ అలియాస్ లాంగూగా గుర్తించారు. మరొకరు ఫుట్బాల్ ప్లేయర్ సిరాజ్. అతడి స్వస్థలం సోపోర్. ఘటనా స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అమీర్ సిరాజ్ ఈ ఏడాది జులై నుంచి కనిపించకుండా పోయాడు. ఫుట్బాల్ ఆడేందుకు గ్రౌండ్కు వెళ్తున్నానని చెప్పి.. సోపోర్లోని ఆదిపోరా ప్రాంతంలోని తన మేనమామ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి రాలేదు.
ఎంత వెతికినా సిరాజ్ ఆచూకీ దొరకలేదు. అతడు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాడని ఇటీవలే తెలిసింది. సిరాజ్కు ఇంతకు ముందు ఉగ్రమూలాలు లేవు. ఐతే ఆదిపోరా ప్రాంతం నుంచి గతంలో చాలా మంది యువకులు ఉగ్రవాదులుగా మారారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదం పట్ల ప్రేరేపితమై అమీర్ సిరాజ్ కూడా టెర్రరిస్టుగా మారిపోయాడని పోలీసులు తెలిపారు.