అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రైతుల దీక్ష 250 రోజులకు చేరుకున్న సందర్భంగా దీక్షకు మండల టిడిపి, సిపిఐ నాయకులు ఆదివారం సంఘీ భావం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల టిడిపి కన్వీనర్ విజయ భాస్కర్ గౌడ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దిలేటి శెట్టి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతో 33 వేల ఎకరాలు రాజధాని కోసం రైతులు ఇచ్చారన్నారు. అభివృద్ధి కోసం రూ 10 వేల కోట్లు టిడిపి ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం పాలన వికేంద్రీకరణ పేరుతో రాజధానిని మూడు ముక్కలు చేయడానికి చూస్తోందని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైసిపి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు ఎన్ని మొట్టికాయలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తీరు మారడం లేదన్నారు. ఇలానే మొండిగా వ్యవహరిస్తే దశలవారీ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఉచ్చిరప్ప, బడి గింజల రంగన్న, మల్లికార్జున గౌడ్, భాస్కరు, వీరేశ్, చంద్రశేఖర్ గౌడ్, సిపిఐ నాయకుడు నరసరావు పాల్గొన్నారు.