పరువు పేరిట పగ పెంచుకుని సొంతవారి ప్రాణాలు తీసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి ఘటనలు మన దేశంలోనే కాదే ఇతర దేశాల్లోనూ వెలుగుచూస్తున్నాయి. అటువంటి ఓ పరువు హత్య తాజాగా పాకిస్థాన్ లో చోటు చేసుకుంది. ఇంటిపక్కన ఉండే యువకుడితో తన చెల్లెలు చనువుగా ఉంటోందని అన్న ఆమెను కాల్చిపారేశాడు.ఈ విషాద ఘటన కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. హసమిన్ కమర్ అనే వ్యక్తి తన చెల్లెలిని తుపాకీతో పాయింట్ బ్లాక్ల్ లో పెట్టి కాల్చగా ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఆ కొద్ది సేపటికే రక్తం మడుగులో కొట్టుకుని కన్నుమూసింది. ఈ ఘటనపై సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ సౌత్ షీరాజ్ నజీర్ మాట్లాడుతూ.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అతడిని విచారించగా తన కుటుంబ గౌరవం కోసమే చంపానని అంగీకరించాడని చెప్పారు. నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని విచారణలో వెల్లడించారు.