కరోనా సమయంలో కేరళాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజా జీవనం అస్తవ్యస్తం అయింది. ఓవైపు సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నా కరోనా భయం వెంటాడుతోంది. మొన్నటికి మొన్న విమాన ప్రమాదంతో కేరళా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అది చాలదన్నట్టు ఇప్పుడు వర్షాలు కేరళాలో గుబులు రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రమంతటా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పెరియార్ నది పొంగి పొర్లడంతో అలువాలోని శివాలయం నీట మునిగింది. ఆలయం నీట మునిగి మూడు రోజులు గడుస్తున్నా ఇంకా వరద ఉధృతి తగ్గడంలేదు.
గత రాత్రి వాయనాడ్ జిల్లాలోని సుగందగిరి అనే గిరిజన గ్రామంపై బురద మేటలు విరుచుకుపడ్డాయి. కొండ దిగువన గ్రామం ఉండటంతో కొండపై నుంచి బురద జారి ఇండ్లను కమ్మేసింది. బురదలో రెండిళ్లు పూర్తిగా కూరుకుపోయాయి. కాగా, ప్రమాదాన్ని ముందే గ్రహించిన అధికారులు గ్రామస్తులను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ఆస్తినష్టం కూడా జరగలేదని అధికారులు వెల్లడించారు.