పోలీసులపై కాల్పులు జరిపి పరారైన గ్యాంగ్స్టర్ వికాస్ దూబే కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అతడి గ్యాంగ్లోని 21 మందిని గుర్తించిన పోలీసులు వారిని సైతం పట్టుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దూబే అనుచరుడు దయాశంకర్ అగ్నిహోత్రి అలియాస్ కల్లూను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొన్నారు. గురువారం రాత్రి పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన వికాస్ దూబేపై రివార్డును పోలీసులు పెంచారు. ఇదివరకు ఆయన తలపై ఉన్న రూ.50 వేలను రూ.లక్షకు పెంచారు.జవహర్పురం పులియాలోని కల్లూ ఇంటిని శనివారం రాత్రి పోలీసులు గుర్తించారు. పట్టుకొనేందుకు వెళ్లగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పోలీసులు తిరిగి కాల్పులు జరుపగా అగ్నిహోత్రి కాలులో బుల్లెట్ దిగి కుప్పకూలిపోయాడు. దాంతో పోలీసులు ఆయనను స్థానిక దవాఖానకు తరలించారు. దూబేకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న అగ్నిహోత్రి.. ల్యాండ్ సెటిల్మెంట్లపై ఎక్కువగా దృష్టిపెట్టేవాడు. ఈయనపై కల్యాణ్పూర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే హత్యాయత్నం, ఆయుధాల చట్టకింద రెండు కేసులు ఉన్నాయి. ఇప్పటికే దూబే అనుచరులు ఇద్దరిని పోలీసులు హతమార్చగా మిగిలిన 18 మంది కోసం గాలిస్తున్నారు. వీరిపై కూడా పోలీసులు రివార్డ్ ప్రకటించారు.