కరోనా వేళ అన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తుంటే.. కర్ణాటక ప్రభుత్వం పట్టుపట్టి SSLC పరీక్షలు జరిపింది. ఫలితంగా ఇప్పుడు పరీక్ష రాసిన 32 మందికి కరోనా సోకింది. ఈ పరీక్షలు వద్దని ప్రతిపక్షం, ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు మొత్తం మొత్తుకున్నా ఆ సమయంలో ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ SSLC ఎగ్జామ్ జూన్ 25 నుంచి జులై 3 వరకూ జరిగింది. కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకొని ఎగ్జామ్స్ నిర్వహించినట్లు ప్రభుత్వం చెబుతన్నా.. అందరి భయం నిజమైంది.జులై 3న చివరి పరీక్ష జరిగడంతో అప్పటి నుంచి 14 రోజులు అంటే జులై 17 వరకూ విద్యార్థులకు ఎప్పుడైనా కరోనా లక్షణాలు బయటపడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ముందు జాగ్రత్తగా కరోనా వచ్చిన విద్యార్థుల ప్రైమరీ కాంటాక్టులైన 80 మంది విద్యార్థులను ప్రభుత్వం క్వారంటైన్ చేసింది. అయితే పరీక్షలను కంటైన్మెంట్ జోన్లలో ఉన్న 3911 మంది విద్యార్థులు రాయలేకపోయారు. ప్రభుత్వం తీరు కారణంగానే తమ పిల్లలకు కరోనా సోకిందంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.