కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో లాక్ డౌన్ పొడిగించడానికే కేంద్రం మొగ్గుచూపుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మోదీ ఇటీవల తన ప్రసంగంలో కరోనాపై సుదీర్ఘ పోరాటానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునివ్వడం ద్వారా విస్పష్టమైన సంకేతాలు ఇచ్చారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ పొడిగింపుపై మోదీ అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని అంచనా వేస్తున్నారు. ఆర్ధిక వ్యవస్థకు పెనుభారం అయినప్పటికీ మోదీ సహా కేంద్రమంత్రులంతా లాక్ డౌన్ కొనసాగించడానికే సుముఖంగా ఉన్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే, ఎన్నాళ్లు పొడిగించాలనేదానిపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. కానీ, ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదల పరిస్థితిపై చర్చలు జరుపుతున్నాయని తెలుస్తోంది. అట్టడుగు వర్గాల ప్రజల ఆకలికేకలు తీర్చడంపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించనున్నాయి. లాక్ డౌన్ కారణంగా పనుల్లేక వలసకూలీలు, నిరుపేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల పూట గడవడం కూడా కష్టంగా ఉంది. లాక్ డౌన్ పొడిగిస్తే వీరి సమస్యలు మరింత తీవ్రతరం కానున్నాయి. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ను పొడిగించాలని కేంద్రాన్ని కోరారు. లాక్ డౌన్ ఎత్తివేస్తే కరోనా విజృంభించే ప్రమాదముంది. లాక్ డౌన్ ను పొడిగిస్తే ఆకలికేకలతో పాటు ఆర్ధిక రంగంపై పెను ప్రభావం పడనుంది. అన్ని అంశాలను పరిశీలించిన కేంద్రం లాక్ డౌన్ పొడిగింపుకే సై అంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పారిశ్రామిక దిగ్గజాలు, వ్యాపారవేత్తలు, ఇతర సెలెబ్రిటీలు, ప్రజలపై కూడా కొన్ని బాధ్యతలున్నాయి.