దూకుడైన ఆటతీరు, తెలివైన కెప్టెన్సీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవలే 31వ బర్త్డే జరుపుకున్నాడు. ప్రస్తుతం పరుగుల పరుగుల వరద పారిస్తూ రికార్డుల రారాజుగా మారాడు. అంతేకాదు మూడు ఫార్మాట్లలో భారత జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. కోహ్లీకి ఇప్పుడు 31 సంవత్సరాలు. అతడి ఫిట్నెస్ను బట్టి చూస్తే దాదాపు ఇంకో పదేళ్లు క్రికెట్ ఆడతాడు. ఆ తర్వాత కోచ్ అవుతాడని అందరూ అనుకుంటున్నారు, కానీ.. కోహ్లీ మాత్రం వేరేది ప్లాన్ చేసాడు. రిటైర్మెంట్ తరువాత వంట నేర్చుకోవాలనుకుంటున్నట్లు కోహ్లీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపాడు. కోహ్లీ మాట్లాడుతూ... 'చిన్నప్పటి నుండి భోజన ప్రియుడినే. రకరకాల వంటకాలు రుచి చూడడం నాకు ఎంతో ఇష్టం. ఎక్కువగా జంక్ ఫుడ్ తినేవాణ్ని. ప్రయాణాల్లో రకరకాల వంటకాలు రుచి చూసేవాణ్ణి. రుచికరంగా వండిన వంటలు అంటే నాకు ఎంతో ఇష్టం' అని తెలిపాడు. 'చాలా రకాల వంటలు తిన్నా.. ఎలా వండాలో మాత్రం తెలియదు. అయినా వంట రుచిని, దాన్ని ఎంత బాగా వండారో మాత్రం ఇట్టే చెప్పగలిగేవాణ్ణి. ఇప్పటికైతే సమయం దొరకడం లేదు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక నేను తప్పకుండా వంట నేర్చుకుంటాను. నాకు చాలా ఆసక్తి ఉంది' అని కోహ్లీ అన్నాడు. డిల్లీలో పుట్టి పెరిగిన విరాట్ కోహ్లీ ఫిట్నెస్ కోసం శాకాహారిగా మారిన విషయం తెలిసిందే. ఫిట్నెస్ కోసం కొన్ని సంవత్సరాలుగా ఆహారపు అలవాట్లో ఎన్నో మార్పులు చేసాడు. అయినప్పటికి ఇప్పటికి కోహ్లీ మంచి భోజన ప్రియుడే. పంజాబీ వంటకాలైన రాజ్మా చావల్, బటర్ చికెన్, నాన్ తింటూ పెరిగాడు. అయినా ఇప్పటివరకు కోహ్లీకి వంట చేయటం రాదు. అందుకే రిటైర్ అయ్యాక దాన్ని ప్లాన్ చేసాడు. తీరిక లేని క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి భూటాన్ పర్యటనకు వెళ్ళాడు. నవంబరు 14నుంచి బంగ్లాదేశ్తో జరగబోయే రెండు టెస్టు సిరీస్లకు కోహ్లీ నాయకత్వం వహించనున్నాడు. ఇండోర్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. అనంతరం కలకత్తా వేదికగా 22 నుండి డే-నైట్ టెస్ట్ ప్రారంభం కానుంది.